తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళతో మరికొందరిని సుప్రీంకోర్టు దోషులుగా తేల్చిన విషయం తెల్సిందే. ఈ కేసులో శశికళతో పాటు.. ఆమె వదిన, జయలలిత మాజీ దత్తపుత్రుడు సుధాకరన్లు బెంగుళూరులోని పరప్పణ అగ్రహార కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు.
అయితే, ఈ జైల్లోని కొందరు ఖైదీలకు ఆడింది ఆట పాడింది పాట అన్న పరిస్థితులున్నాయి. సెల్ఫోన్లు సహా వారు ఏదీ కావాలనుకొంటే అది అందుతోందట. ఇదంతా జైలు అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుంది. ఖైదీగా ఉన్న అన్నాడీఎంకే నేత శశికళకు వీఐపీ సౌకర్యాలు లభిస్తున్నాయని రాష్ట్ర జైళ్లశాఖ డీజీ రూప చేసిన సంచలన ఆరోపణలతో అందరి దృష్టి ఇప్పుడు ఈ జైలుపై పడింది.
ముఖ్యంగా.. శశికళకు వీఐపీ సౌకర్యాలు కల్పించేందుకు రూ.2 కోట్ల మేరకు లంచం పుచ్చుకున్నట్టు డీఐజీ డి.రూప సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమెను ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రూ.2 కోట్ల లంచం తీసుకుని శశికళకు వీవీఐపీ సౌకర్యాలు కలిపిస్తున్నారని ఆఫీసర్ రూప మీడియాకు వెల్లడించిన నేపథ్యంలో పోలీసు నియమాలను అతిక్రమించావంటూ కర్ణాటక ప్రభుత్వం ఆమెకు నోటీసులు జారీ చేసి, ఈ చర్య తీసుకుంది.