బార్ పైకప్పులోంచి దూరి చిత్తుగా తాగిన రౌడీషీటర్ ... పట్టించిన చెప్పులు

శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (16:59 IST)
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోవుంది. ఈ సమయంలో కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా, రెస్టారెంట్లు, బార్లు, మద్యంషాపులు కల్లు దుకాణాలు పూర్తిగా మూతబడ్డాయి. దీంతో మద్యంబాబులు మందు లేక పిచ్చెక్కినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఓ రౌడీ షీటర్ సాహసం చేశారు. బార్ పైకప్పులోంచి చిత్తుగా తాగాడు. ఆ తర్వాత మళ్లీ వెనక్కి వెళ్లలేకు అడ్డంగా బుక్కయ్యాడు. ఈ విచిత్ర సంఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హసన్ పట్టణానికి చెందిన 27 ఏళ్ల రోహిత్ అనే రౌడీ షీటర్ మద్యానికి బానిస. లాక్‌డౌ‌న్ కారణంగా మద్యం దొరక్కపోవడంతో అతడి బాధ వర్ణనాతీతం. ఎలాగైనా మద్యం తాగాలని ఓ ప్లాన్‌ వేశాడు. ఇందుకోసం పెద్ద సాహసానికి ఒడిగట్టాడు. 
 
ఇందుకోసం గతంలో తాను ప్రతి రోజూ వెళ్లే బార్‌నే లక్ష్యంగా చేసుకున్నాడు. ఆ బార్ సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి... బార్‌ పైభాగానికి చేరుకున్నాడు. పైన అతికించిన పెంకులు తొలగించి లోపలికి దూరిపోయాడు. చాన్నాళ్ల తర్వాత మద్యం కనిపించడంతో మోతాదుకు మించి తాగాడు. దాంతో నిషా తలకెక్కడంతో అక్కడే పడిపోయాడు. 
 
అయితే, బార్లోకి వెళుతూ వెళుతూ తన చెప్పులను గోడపక్కనే వదిలివెళ్లాడు. వీటిని చూసిన సెక్యూరిటీకి అనుమానం వచ్చి, బార్లోకి వెళ్లి చూడగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తాగిన మద్యం మత్తులో గురకపెట్టి నిద్రపోతూ రౌడీషీటర్ రోహిత్ కనిపించాడు. దీంతో ఆ గార్డులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు