ఇంటి అద్దె చెల్లించలేదని తుపాకీతో కాల్పులు జరిపిన యజమాని

మంగళవారం, 16 జూన్ 2020 (08:55 IST)
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. దీంతో అనేక మంది ఉపాధిని కోల్పోయారు. ఫలితంగా అద్దె ఇళ్ళలో నివాసం ఉండేవారు ఇంటి అద్దెలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఇంటి అద్దెలు చెల్లించాలని ఒత్తిడి చేయొద్దంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించినా ఫలితం లేకుండాపోతోంది. పలు ప్రాంతాల్లో ఇంటి యజమానులు కిరాయిదార్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అద్దె చెల్లించాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. తాజాగా కర్నాటక రాష్ట్రంలో ఓ యజమాని.. తన ఇంట్లో ఉంటున్న కిరాయిదారునిపై తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన 9 సెకన్ల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగళూరు నగరానికి సుమారుగా 572 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెళగావి జిల్లాలోని చికోడి పట్టణంలో శ్రీమంత్ దీక్షిత్ ఓ అద్దె ఇంటిలో నివసిస్తున్నారు. ఈయన గత మార్చి నెల నుంచి అద్దె చెల్లించలేకపోతున్నాడు. దీంతో ఇంటి యజమాని కుమారుడు వచ్చి, ఇంటికి కరెంట్‌ను కట్ చేసి వెళ్లాడు. 
 
ఇదే కిరాయిదారు, యజమాని షా మధ్య వివాదానికి కారణమైంది. ఇద్దరి మధ్యా వాదనలో తొలుత కిరాయిదారు, దీంతో ఆగ్రహం చెందిన కిరాయిదారు ఓ పదునైన ఆయుధంతో దాడికి దిగడంతో యజమాని చేతికి గాయమైంది. ఆ తర్వాత తీవ్ర ఆగ్రహానికి గురైన ఇంటి యజమాని తన వద్ద ఉండే లైసెన్డ్స్ గన్‌తో కాల్పులు జరిపాడు.
 
ఇంటి అద్దె అడ్వాన్స్ నిమిత్తం ఇచ్చిన రెండు నెలల అద్దెను చెల్లుబెట్టుకుని, మరో నెల అద్దె కట్టేసి ఇల్లు ఖాళీ చేయాలని షా కోరగా, అందుకు దీక్షిత్ అంగీకరించలేదు. లాక్డౌన్ కారణంగా తాను పని కోల్పోయి ఉంటే, అద్దె అడుగుతున్నాడని అతను ఆరోపిస్తున్నాడు. ఈ విషయంలో రెండు కుటుంబాలూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టడంతో, పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు