అమ్మకు దెయ్యం పట్టిందని కర్రలతో కొట్టి చంపించిన కుమారుడు...

ఠాగూర్

మంగళవారం, 8 జులై 2025 (16:39 IST)
crime scene
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. మూఢనమ్మకం పరాకాష్టకు చేరింది. దెయ్యం పట్టిందన్న అనుమానంతో తల్లిని కన్నకొడుకు కట్టించి చంపేశాడు. భూతవైద్యం పేరుతో మహిళపై గంటల తరబడి కర్రలతో దాడిచేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన 55 యేళ్ళ తల్లి గీతమ్మ ప్రాణాలు కోల్పోయింది.
 
వివరాలను పరిశీలిస్తే, గీతమ్మ (55) ప్రవర్తనలో మార్పులు రావడంతో ఆమె దెయ్యం పట్టిందని ఆమె కొడుకు సంజయ్ బలంగా నమ్మాడు. ఈ క్రమంలో భూతవైద్యం చేస్తానని చెప్పిన ఆశ అనే మహిళను ఆమె భర్త సంతోశ్‌ను సంప్రదించాడు. 
 
సోమవారం రాత్రి గీతమ్మ ఇంటికి వచ్చిన ఆశ, సంతోశ్ దెయ్యం వదిలించే పూజలు మొదలుపెట్టారు. ఈ తతంగాన్ని వీడియో కూడా తీశారు. ఆ వీడియోలో అర్థ స్పృహలో ఉన్న గీతమ్మ తలపై నిమ్మకాయతో కొట్టడం, జట్టు పట్టుకుని లాగి చెంపపై కొట్టడం వంటి దృశ్యాలు ఉన్నాయి. 
 
రాత్రి 9.30 గంటలకు మొదలైన ఈ దాడి తెల్లవారుజామున 1 గంట వరకు కొనసాగింది. కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో గీతమ్మ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, గీతమ్మ కొడుకు సంజయ్‌తో పాటు భూతవైద్యం పేరుతో దాడికిపాల్పడిన ఆశ, ఆమె భర్త సంతోశ్‌ను అరెస్టు చేశారు. ముగ్గురిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు