ఆ పులి ఎక్కడ కనబడితే అక్కడే కాల్చి చంపి పారేయండి

శనివారం, 13 మార్చి 2021 (13:25 IST)
కర్నాటక కొడగు జిల్లాలో పెద్దపులి మనిషి రక్తాన్ని మరిగి చాటునుంచి పంజా విసురుతూ వారం రోజుల్లో నలుగురిని పొట్టనబెట్టుకుంది. దీనితో ఆ ప్రాంత ప్రజలు పెద్దఎత్తున నిరసనకు దిగారు. ఆ పులిని మీరైనా చంపండి లేదంటే మేమే అడవిలోకి వెళ్లి దాని అంతం చూస్తామని రోడ్డుపై బైఠాయించారు.
 
దీనితో కొడగులో పులిని చంపడానికి కాల్పుల ఉత్తర్వు జారీ చేసినట్లు కర్ణాటక అటవీ శాఖ మంత్రి అరవింద్ లింబవాలి తెలిపారు. పులిని చంపడానికి స్థానికులను అనుమతించాలని డిమాండ్ చేసిన బిజెపి ఎమ్మెల్యేలు కెజి బోపయ్య, అప్పచు రంజన్‌లపై లింబవాలి స్పందిస్తూ, జంతువులను చంపడానికి సభ్యులకు(లేదా స్థానికులకు) హక్కు లేదని అన్నారు.
 
"అవసరమైన చర్యలు తీసుకోవాలని నేను ఇప్పటికే అధికారులను ఆదేశించాను. మనుషులను చంపుతున్న ఆ పులిని ఎక్కడ కనబడితే అక్కడ కాల్చి చంపాలని నేను ఆదేశించాను,” అని హామీ ఇచ్చారు. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో కనీసం నలుగురు వ్యక్తులు పులివాత పడి మృత్యవాత పడ్డారు. 
 
పులి దాడుల్లో అనేక జంతువులు చనిపోయాయి. ఒకే పులి వల్ల ఈ మరణాలు సంభవించాయా లేదా ఈ ప్రాంతంలో మరిన్ని పులుల సంచారం వున్నదా అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు