'బిడ్డా.. తిరిగిరా! కలిసి కలో గంజో తాగుదాం.. చెడు సోపతులు నీకొద్దు నాయనా..'

శనివారం, 3 మార్చి 2018 (12:17 IST)
అమ్మ పిలుపుతో ఆ ఉగ్రవాది చలించిపోయాడు. కన్నపేగు బంధానికి తలవంచారు. బిడ్డా అంటూ ఆ చేసిన వేడుకోలుతో కరుడుగట్టిన ఉగ్రవాదిగా మారిన ఆ యువకుడు సాధారణ పౌరుడిగా మారాడు. ఫలితంగా జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
జమ్మూకాశ్మీర్‌లో ఎందరో చిన్నతనంలోనే ఉగ్రవాదానికి ఆకర్షితులై సంఘవిద్రోహ చర్యలకు పాల్పడుతున్నారు. ఇదే క్రమంలో ఓ మారుమూల ప్రాంతానికి చెందిన యువకుడు కొన్నాళ్ల క్రితం ఉగ్రవాదుల్లో చేరిపోయాడు. కొడుకును తన చెంతకు చేర్చాలని ఇటీవల అతడి తల్లి మీడియా ముందుకు వచ్చింది. 
 
'బిడ్డా.. తిరిగిరా! కలిసి కలో గంజో తాగుదాం. చెడు సోపతులు నీకొద్దు నాయనా..' అని ఆ అమ్మ వేడుకోవడంతో చలించిపోయిన యువకుడు ఉగ్రవాదాన్ని విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చాడు. 
 
తల్లి ఆవేదనను అర్థం చేసుకున్న ఆ యువకుడు శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అమ్మ కోసం తాను ఉగ్రకార్యకలాపాలు శాశ్వతంగా విడిచిపెడుతున్నట్లు ప్రమాణం చేశాడు. భద్రతా కారణాల దృష్ట్యా అతడి వివరాలను వెల్లడించడం లేదని రాష్ట్ర డీజీపీ ఎస్‌పీ వేద్‌ ట్విట్టర్‌లో తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు