వారితో నాకేంటి పని... నా మనుమరాలు పరీక్షలు రాయాలి.. గిలానీ బండారం బట్టబయలు

శనివారం, 29 అక్టోబరు 2016 (10:03 IST)
కాశ్మీర్ వేర్పాటువాదుల నిజస్వరూపం బహిర్గతమైంది. తమ మాటలకు... చేతలకు ఏమాత్రం పొంతన ఉండదని ఈ ప్రపంచానికి నిరూపించారు. తమకో న్యాయం, మిగతా కాశ్మీరీలందరికీ మరో న్యాయం అని వ్యవహరించారు. ఈ విషయం మీడియా ద్వారా బహిర్గతం కావడంతో వేర్పాటువాదులపై కాశ్మీరీలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇటీవల ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్‌కౌంటర్ జరిగింది. దీనికి నిరసనగా కాశ్మీర్ లోయ అట్టుడికిపోయింది. హురియత్ కాన్ఫరెన్స్ నేతలు ఇచ్చిన పిలుపుతో జమ్ముకాశ్మీర్‌లో అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసి వేశారు. ఆందోళనకారులు చాలా పాఠశాలలను తగులబెట్టారు. కానీ శ్రీనగర్‌లోని ఒక పాఠశాలకు మాత్రం ఇంటర్నల్ పరీక్షలు అనుకున్న సమయానికే జరిగాయి. 
 
అక్టోబర్ ఒకటి నుంచి ఐదు వరకూ పెద్ద స్థాయిలో భద్రత కల్పిస్తూ ఇండోర్ స్టేడియంలో 573 మంది విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించారు. ఇదంతా ఎలా సాధ్యమైందంటే హురియత్ కాన్ఫరెన్స్ నేత సయ్యద్ అలీషా గిలానీ మనవరాలు ఆ పాఠశాలలో చదవడమే కారణం. 
 
విషయం మీడియా ద్వారా బయటపడటంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. హురియత్ ఆందోళనలవల్ల మూడు నెలలుగా తమ పిల్లల చదువులు ముందుకు సాగకపోగా వేర్పాటువాద నాయకుల పిల్లలకు మాత్రం పరీక్షలు అనుకున్న సమయానికే సాగడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. 
 
జనం బహిరంగంగానే వేర్పాటువాదులను తూర్పారబడుతున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూడా బహిరంగంగానే గిలానీ తీరును ఎండగట్టారు. వేర్పాటువాదుల తీరును తూర్పారబట్టారు. ప్రజల్ని రెచ్చగొడుతూ, విద్యార్ధులకు చదువు దూరం చేస్తూ, కాశ్మీర్ యువత చేతిలో పుస్తకాల బదులుగా రాళ్లు ఉండేలా చూసే వేర్పాటువాదుల తీరును ఆమె ప్రపంచం ముందు ఉంచారు. ఇప్పటికైనా ఆందోళనలు ఆపివేసి, పాఠశాలలు తెరుచుకునేలా చేసి కాశ్మీర్ విద్యార్ధులకు సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు.

వెబ్దునియా పై చదవండి