సోషల్ డిస్టెన్స్ : ముఖానికి మాస్క్ - చేతిలో గొడుగు తప్పనిసరి.. ఎక్కడ?

బుధవారం, 29 ఏప్రియల్ 2020 (11:11 IST)
కరోనా వైరస్ బాధిత రాష్ట్రాల్లో కేరళ రాష్ట్రం ఒకటి. అయితే, ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల కేరళ కరోనా వైరస్ నుంచి త్వరగానే బయటపడింది. కానీ, అక్కడక్కడా ఒకటి రెండు కరోనా కేసులు నమోదవుతున్నాయి. అవికూడా నమోదు కాకుండా ఉండేందుకు సామాజిక భౌతిక దూరాన్ని పాటించాలని తమ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేస్తోంది. 
 
అయితే, ప్రజలు ఏమాత్రం పట్టించుకోకుండా పెడచెవిన పెడుతున్నారు. దీంతో ఓ గ్రామ పంచాయతీ వినూత్నంగా ఆలోచన చేసింది. తమ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలంతా ఇంటి నుంచి కాలు బయటపెడితే ముఖానికి మాస్క్ తప్పనిసరిగా ధరించి, గొడుగు వేసుకుని సామాజిక దూరాన్ని పాటించాలంటూ ఏకంగా ఓ తీర్మానం చేసింది.
 
నిత్యావసరాల కొనుగోలు లేదా మరే ఇతర అవసరాల నిమిత్తం బయటకు వచ్చినా, గొడుగు కూడా వెంట ఉండాల్సిందేనని రాష్ట్రంలోని అలపుళ సమీపంలోని తన్నీర్ ముక్కోమ్ గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. వ్యక్తుల మధ్య గొడుగు ఉంటే, కనీసం మూడు అడుగుల దూరమైనా ఉంటుందని భావించిన పంచాయతీ అధికారులు, ఈ మేరకు ప్రజలకు ఆదేశాలు జారీ చేశారు.
 
అంతేకాదు, అప్పటికప్పుడు గొడుగులను కొనుగోలు చేయలేని వారికి సగం ధరకే గొడుగులను కూడా పంపిణీ చేశారు. ఇక ఈ ఆలోచన ప్రజల మధ్య దూరాన్ని పెంచి సత్ఫలితాలను కూడా ఇస్తోందట. ఇదే విషయాన్ని ట్వీట్ చేసిన రాష్ట్ర మంత్రి థామస్ ఇసాక్, భూతిక దూరాన్ని ప్రజలు పాటించేలా చేసేందుకు గొడుగుల ఆలోచన బాగుందని, తెరచివుంచిన గొడుగులు ఒకదాన్ని ఒకటి తగులకుండా ఉంటే, వ్యక్తుల మధ్య కనీసం మీటర్ దూరం తప్పనిసరిగా ఉంటుందని అన్నారు. గొడుగుల ఆలోచన చాలా బాగుందని నెటిజన్లు కూడా కితాబునిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు