కరోనా వైరస్ ఓ జీవాయుధమా? సినీ దర్శకురాలిపై దేశ ద్రోహం కేసు!

శుక్రవారం, 11 జూన్ 2021 (14:51 IST)
దేశాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. ఇది ఒక జీవాయుధం అని దీన్ని కేంద్రం ప్రయోగించిదంటూ లక్షద్వీప్‌కు చెందిన సినీ దర్శకురాలు అయీషా సుల్తానా ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు చేయడంతో అక్కడి పోలీసులు దేశద్రోహం, విద్వేష ప్రసంగం కింద కేసులు నమోదు చేశారు. 
 
కరోనా కట్టడిలో లక్షద్వీప్ పాలకుడు ప్రఫుల్ ఖోడా విఫలమయ్యారని, కేసులు పెరగడానికి ఆయనే కారణమని ఓ స్థానిక మలయాళం టీవీ చానెల్‌లో జరిగిన చర్చా గోష్టిలో పాల్గొన్న అయీషా వ్యాఖ్యానించింది. అంతేగాకుండా మరో అడుగు ముందుకేసి కేంద్ర ప్రభుత్వమే లక్షద్వీప్ పై జీవాయుధాన్ని ప్రయోగించింది అని కామెంట్ చేసింది.
 
ఒకప్పుడు లక్షద్వీప్‌లో సున్నా కేసులుండేవని, కానీ, ఇప్పుడు రోజూ 100కు పైగానే వస్తున్నాయన్నారు. కాబట్టి లక్షద్వీప్‌పై కేంద్ర ప్రభుత్వమే జీవాయుధాన్ని ప్రయోగించిందని అంటానని వ్యాఖ్యానించింది. ఆమె వ్యాఖ్యలతో లక్షద్వీప్ బీజేపీ నేతలు వీధుల్లో ఆందోళనలు నిర్వహించారు. 
 
ఆమెపై బీజేపీ లక్షద్వీప్ చీఫ్ సి.అబ్దుల్ ఖాదర్ హాజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె వ్యాఖ్యలు జాతి వ్యతిరేకమన్నారు. ఇక తనపై పెట్టిన కేసుపై అయీషా స్పందించారు. ఎప్పుడూ నిజమే గెలుస్తుందని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లో కామెంట్ చేశారు. 
 
ఓ బీజేపీ కార్యకర్త కేసు వేసినంత మాత్రాన భయపడిపోనన్నారు. తాను పుట్టినగడ్డ మీద తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తేల్చి చెప్పారు. ఇక, తన గళాన్ని మరింత గట్టిగా వినిపిస్తానని పేర్కొన్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలిచారు. కేసును వెంటనే వెనక్కు తీసుకోవాలని శశిథరూర్ డిమాండ్ చేశారు. ఈ కేసు నిలవదన్నారు. 
 
కేంద్రాన్ని విమర్శించినంత మాత్రాన దేశద్రోహం కాదని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్పిందని, అయినా రాష్ట్రాల పోలీసులు దానిని పట్టించుకోవట్లేదన్నారు. కోర్టులో దేశద్రోహం కేసు విఫలమవుతుందని, అయితే, అప్పటి వరకు ఆమెకు చిత్ర హింసలు తప్పవని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచిదికాదని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు