హాయిగా డిన్నర్ చేద్దామని రెస్టారెంట్‌కు వెళితే.. ఇలాంటి కీచకులతో...?

సోమవారం, 23 సెప్టెంబరు 2019 (11:40 IST)
ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన ముగ్గురు మహిళలకు చేదు అనుభవం ఎదురైంది. దేశ రాజధాని నగరం ఢిల్లీ సౌత్‌లోని గ్రేటర్ కైలాష్ పార్ట్ 2, ఎం బ్లాక్, సైడ్‌కార్ అనే రెస్టారెంట్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. 


తమతో అభ్యంతరకరంగా ప్రవర్తించిన పురుషుల ఫోటోలను ఆ మహిళ పోస్ట్ చేసింది. కొంతమంది యువకులు అభ్యంతరకర వ్యాఖ్యలు, అసభ్యకర చేష్టలతో తమను తీవ్రంగా ఇబ్బందిపెట్టారని వారు ఆరోపించింది. 
 
వివరాల్లోకి వెళితే.. శనివారం రాత్రి 10.30గంటల ప్రాంతంలో సౌత్ ఢిల్లీలోని సైడ్‌కార్‌ రెస్టారెంట్‌లో ఈ ముగ్గురు డిన్నర్ చేసేందుకు వెళ్లారు. అక్కడ తమ వెనుక టేబుల్‌పై కూర్చున్న కొంతమంది యువకులు వారిపై అభ్యంతరకర కామెంట్స్ చేశారు. అంతేకాదు, అందులో ఓ యువకుడు వారి వైపు తన కుడి కాలు చూపిస్తూ బెదిరించాడని చెప్పారు. 
 
రెస్టారెంట్‌లో కూర్చున్న 25 నిమిషాల పాటు అభ్యంతరకర వ్యాఖ్యలతో వెకిలి చేష్టలతో తీవ్రంగా వేధించారని వాపోయారు. ఒకరకంగా మాటలతో తమను రేప్ చేశారని, ఆ మాటలకు తీవ్రంగా కుమిలిపోయామని అన్నారు. ఇక వాళ్ల వేధింపులను భరించలేక పోలీసులకు కాల్ చేయడంతో అక్కడి నుంచి పారిపోయారని చెప్పారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు.
 
ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్ (సౌత్) అతుల్ కుమార్ ఠాకూర్ మాట్లాడుతూ.. ప్రాథమిక సమాచార నివేదిక దాఖలు చేసినట్లు తెలిపారు. నిందితులను గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తాము కూర్చున్న కుర్చీలపై చేయి వేయడం.. దూకుడుగా కుర్చీని నెట్టడం.. ఏమని అడిగితే అభ్యంతరకరంగా ప్రవర్తించడం చేశారని బాధితురాలు ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. 
 
కుడికాలును ఎత్తి ముఖం వైపు చూపుతూ కాళ్లు నొక్కండి అంటూ చూపెట్టాడని.. ఇంకా అనరాని మాటలతో వేధింపులకు గురిచేశాడని సదరు మహిళ ఎఫ్‌బీలో వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు