శ్మశానంలో దొంగలుపడ్డారు. వీరు మనిషి పుర్రె (కపాలం)ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మహారాష్ట్రలోని జల్గావ్ శ్మశానవాటికలో జరిగింది. చితిలో గాలించి మరీ కపాలం ఎత్తుకెళ్లారు. ముందురోజు సాయంత్రం ఓ వృద్ధురాలి మృతదేహాన్ని ఒంటిపై ఉన్న నగలను తీయకుండా ఖననం చేశారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు దొంగలు ఈ దారుణానికి పాల్పడ్డారు. తులం బంగారం కోసం ఇంతటి దారుణానికి ఒడిగట్టడం విస్మయం కలిగిస్తోంది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జల్గావ్కు చెందిన ఛాబాబాయి కాశీనాథ్ పాటిల్ అనే వృద్ధురాలు ఈ నెల 5వ తేదీన మరణించింది. అంత్యక్రియలను కుటుంబ సభ్యులు సోమవారం నిర్వహించారు. ఛాబాబాయి చివరి కోరిక మేరకు ఆమె ఒంటిపై ఉన్న నగలను అలానే ఉంచి దహనం చేశారు.
మరుసటి రోజు అంటే మంగళవారం అస్థికల కోసం శ్మశానం వద్దకు వెళ్లిన కుటుంబ సభ్యులు అక్కడి పరిస్థితి చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. చితిలోని బూడిద చిందరవందరంగా పడివుండగా ఎముకలు, కపాలంలు మాత్రం కనిపించకుండా పోయాయి. దీంతో ఛాబాబాయి కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. బంగారం కోసమే దొంగలు ఛాబాబాయి కపాలం, ఎముకలను ఎత్తుకెళ్ళివుంటారని వారు ఆరోపిస్తున్నారు.