‘పెగాసస్‌’పై విచారణ కమిషన్‌... బెంగాల్‌లో నియమించిన మమతా

మంగళవారం, 27 జులై 2021 (08:30 IST)
దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న పెగాసస్‌ స్పైవేర్‌ వివాదంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో పలువురు రాజకీయ నేతలు, అధికారులు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయన్న ఆరోపణలపై రాష్ట్ర పరిధిలో విచారణ జరిపేందుకు కమిషన్‌ను నియమించారు.

కలకత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జ్యోతిర్మయి భట్టాచార్య, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్‌ బి.లోకూర్‌తో ద్విసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం ఆమె ఢిల్లీకి బయలుదేరే ముందు ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రముఖుల ఫోన్ల హ్యాకింగ్‌పై కేంద్ర ప్రభుత్వంలో స్పందన లేనందున తామే విచారణ కమిషన్‌ను నియమించినట్లు, విచారణ కమిషన్‌ చట్టం-1952లోని సెక్షన్‌-3 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం.. ఏ అంశంపైనైనా కేంద్ర ప్రభుత్వం విచారణ కమిషన్‌ను నియమిస్తే.. అదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కమిషన్‌ను నియమించేందుకు అవకాశం ఉండదు.

ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే మాత్రం.. కేంద్ర కమిషన్‌ విచారణ జరిపినంతకాలం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిషన్‌ కూడా తమ కార్యకలాపాలు కొనసాగించవచ్చు. అలా కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వమే ముందుగా విచారణ కమిషన్‌ను నియమిస్తే, అదే అంశంపై కేంద్ర ప్రభుత్వం మరో కమిషన్‌ను నియమించేందుకు అవకాశం ఉండదు. అయితే ఆ రాష్ట్రంతోపాటు మరిన్ని రాష్ట్రాల్లో విచారణ జరిపాలని నిర్ణయిస్తే మాత్రం కేంద్రం మరో కమిషన్‌ను నియమించవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు