మమతా బెనర్జీకి కౌంట్‌డౌన్ మొదలైనట్టే : కేంద్ర మంత్రి గిరిరాజ్

శనివారం, 8 జూన్ 2019 (15:07 IST)
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలనకు కౌంట్‌‌డౌన్ మొదలైనట్టేనని ఆయన జోస్యం చెప్పారు. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్ రాష్ట్రంలో టీఎంసీ - బీజేపీకి మధ్య హింసాంత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. 
 
అయితే ప్రమాణ స్వీకారోత్సవానికి ఎన్నికల సమయంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానించారు. దీనికి నిరసనగా మోడీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని మమతా బెనర్జీ బహిష్కరించారు. అలాగే, ప్రధాని మోడీ సారథ్యంలో జరుగనున్న నీతి ఆయోగ్ భేటీకి కూడా హాజరుకావడం లేదని స్పష్టం చేశారు. 
 
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ స్పందిస్తూ, సీఎం మమతా బెనర్జీ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తరహాలో ప్రవర్తిస్తోందని ఆరోపించారు. అందువల్ల ఆమె పాలనకు కౌంట్‌డౌన్ మొదలైనట్టేనని చెప్పారు. 
 
బీహార్‌కు చెందిన గిరిరాజ్ సింగ్... శనివారం స్పందిస్తూ, ఓటమి భయంతో ఆమె తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. తన రాజకీయ ప్రత్యర్థులతో ఆమె వ్యవహరిస్తున్నతీరు కిమ్ జోంగ్ ఉన్‌ను తలపిస్తోందని ఆరోపించారు. ఆమె వైఖరి దేశ సమాఖ్య నిర్మాణానికి విరుద్దంగా ఉందన్నారు. తాను దేశ ప్రధానిగా నరేంద్ర మోడీని గుర్తించననీ, ముఖ్యమంత్రులంతా హాజరయ్యే నీతి ఆయోగ్ సమావేశానికి కూడా రానని చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు