మామిడి పండ్లను దొంగతనం చేశాడని టీనేజ్ బాలుడి బొటన వేలిని కోసేశాడు!

గురువారం, 7 జులై 2016 (09:29 IST)
చెట్టునుండి మామిడి పండ్లు దొంగతనం చేశాడని తోట యజమాని టీనేజ్ బాలుడి బొటన వేలిని కోసి క్రూరంగా హింసించాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఔరాయ్యా జిల్లాలోని బైసోలి గ్రామంలో చోటుచేసుకుంది. అన్షూ అనే టీనేజ్ బాలుడు మంగళవారం తన ఇంటి ఎదురుగా ఉన్నవ్యక్తి తోటలోని మామిడి పండ్లను చెట్టు ఎక్కి దొంగచాటుగా కోసాడు. ఇది గమనించిన తోటయజమానికి కోపం కట్టలు తెంచుకుంది. దీంతో ఆ బాలుడిని గొడ్డును బాదినట్టు బాదారు. 
 
ఆ బాలుడు క్షమించమని కాళ్లపడి వేడుకున్నా... ఆ తోటయజమానికి కోపం తగ్గలేదు. మామిడి పండ్లు కోసే పదునైన కత్తితో అన్షూ బొటన వేలిని తెగ్గోశాడు. ఆ బాధను భరించలేక బాలుడు కేకలు పెట్టాడు. తీవ్రమైన రక్తస్రావంతో కుప్పకూలాడు. ఆ బాలుడి అరుపులు కేకలు విన్న గ్రామస్తులు పరుగో పరుగున వచ్చి అతని కాపాడి తల్లితండ్రులకు సమాచారం ఇచ్చారు. 
 
గాయాలపాలైన ఆ బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. అప్పటికే చాలా రక్తం పోయింది. ఆవేశం చెందిన కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆ తోటలోకి రంగ ప్రవేశం చేశారు. అప్పటికే యజమాని పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి