హనీ ట్రాప్.. పాక్ మహిళలకు భారత రక్షణ సమాచారం ఇచ్చాడు.. అరెస్ట్

సెల్వి

గురువారం, 14 మార్చి 2024 (21:54 IST)
భారత రక్షణ సమాచారాన్ని సేకరించి, పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సెటప్‌లోని ముగ్గురు మహిళా హ్యాండ్లర్‌లతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నందుకు ఆనంద్ రాజ్ సింగ్ అనే వ్యక్తిని రాజస్థాన్ పోలీసుల నిఘా బృందం గురువారం అరెస్టు చేసింది. నిందితుడు సూరత్‌గఢ్ ఆర్మీ కాంట్ వెలుపల యూనిఫాం దుకాణాన్ని నడుపుతున్నాడని అధికారులు తెలిపారు.
 
పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు నిర్వహిస్తున్న గూఢచర్య కార్యకలాపాలను రాజస్థాన్ ఇంటెలిజెన్స్ నిరంతరం పర్యవేక్షిస్తోందని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. 
 
ఈ క్రమంలో సూరత్‌గఢ్ ఆర్మీ కాంట్ వెలుపల యూనిఫాం దుకాణాన్ని నడుపుతున్న ఆనంద్ రాజ్ అనే యువకుడు సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సెటప్‌కు చెందిన ముగ్గురు మహిళా హ్యాండ్లర్‌లతో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు కనుగొనబడింది.
 
ఆర్మీ కాంప్లెక్స్‌కు సమీపంలో ఉన్న తన యూనిఫాం స్టోర్ ద్వారా ఆనంద్ రాజ్ మిలటరీ సిబ్బందితో సంప్రదింపులు జరుపుతున్నాడని అగర్వాల్ తెలిపారు. 
 
ఆనంద్ రాజ్ కార్యకలాపాలను ఇంటెలిజెన్స్ జైపూర్ బృందం నిశితంగా పరిశీలించినప్పుడు, అతను వ్యూహాత్మక ప్రాముఖ్యత గల సమాచారాన్ని సేకరించి ముగ్గురు పాక్ మహిళా హ్యాండ్లర్‌లకు పంపుతున్నట్లు తెలియవచ్చింది. 
 
వాస్తవానికి ఆనంద్ రాజ్ యూనిఫాం దుకాణం నుంచి కొంతకాలం విడిచిపెట్టి బెహ్రోర్‌లోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఈ సమయంలో కూడా, అతను పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మహిళా హ్యాండ్లర్‌లతో నిరంతరం టచ్‌లో ఉన్నాడు. అతను మహిళా పాకిస్తానీ ఏజెంట్లకు రహస్య సమాచారం పంపుతున్నాడు. ప్రతిఫలంగా డబ్బులు కూడా డిమాండ్ చేశాడు.
 
ఇకపోతే.. సైనిక సిబ్బందితో పాటు కాంప్లెక్స్ చుట్టూ పనిచేస్తున్న పౌరులను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం గురించిన రహస్య సమాచారాన్ని రాబట్టేందుకు పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ప్రయత్నిస్తూనే ఉంది. దీని కోసం, సైనిక సిబ్బంది, సైన్యం గురించి సమాచారం ఉన్న వ్యక్తులను హనీ-ట్రాప్ చేసే మహిళా హ్యాండ్లర్లు భారతీయ మొబైల్ నంబర్లతో నిర్వహించబడే సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగిస్తారు. ఇలా జరిపిన విచారణలోనే ఆనంద్ చిక్కాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు