సహజీవనంలో తేడా... ప్రియురాలిని చంపేసిన ప్రియుడు

సోమవారం, 10 డిశెంబరు 2018 (11:06 IST)
నమ్మిన వ్యక్తులను దారుణంగా చంపేయడం ఈమధ్య ఎక్కువైంది. తనే సర్వస్వం అంటూ వచ్చిన కట్టుకున్న భార్యలను కొందరు హతమారుస్తుంటే.. తన లోకంగా ప్రేమించే ప్రియురాళ్లను మరికొందరు పొట్టనబెట్టుకుంటున్నారు. తాజాగా ముంబైలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. తనతో సహజీవనం చేస్తున్న మహిళనే ఓ ప్రియుడు దారుణంగా చంపిన ఘటన ముంబైలో వెలుగు చూసింది. 
 
వివరాల్లోకి వెళితే... ముంబైలోని మన్‌పద ప్రాంతంలో 26 ఏళ్ల జయశ్రీ తన భర్తతో గొడవలు కారణంగా విడాకులు తీసుకుని వేరుగా వుంటోంది. ఈ క్రమంలో ఆమెకు 30 ఏళ్ల సక్పాల్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆమెకు సాయం అందిస్తున్నట్లుగా మంచిగా నటించాడు. అది కాస్తా సహజీవనానికి దారి తీసింది. ఐతే ఎందుకో ఈమధ్య ఆమెతో గొడవపడటం మొదలుపెట్టాడు. అతడి వేధింపులు ఎక్కువయ్యాయి. వాటిని తట్టుకోలేని జయశ్రీ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని హెచ్చరించి పంపారు. ఐతే అతడి బుద్ధి మాత్రం మారలేదు. మళ్లీ ఆమెతో గొడవపెట్టుకున్నాడు. ఆ గొడవలో తీవ్ర ఆగ్రహానికి గురైన సక్పాల్ పదునైన కత్తి తీసుకుని ఆమెను నరికాడు. దాంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మరణించింది. వెంటనే ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా జయశ్రీ శవం కనిపించింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు