సాధారణంగా దేశంలో నడిచే రైళ్లలో ఆహారం నాసికరకంగా ఉందనో, మరుగుదొడ్డి అపరిశుభ్రంగా ఉందనో, ఏసీ బోగీల్లో సరఫరా చేసే దుప్పట్ల నుంచి దుర్వాసన వస్తుందనో ఫిర్యాదులు తరచుగా వస్తుంటాయి. కానీ, ఇటీవల ఓ ప్రయాణికుడుకి వింత అనుభవం ఎదురైంది. ప్రశాంత్ కుమార్ అనే ప్రయాణికుడు సెకండ్ క్లాస్ ఏసీ బోగీలో ప్రయాణించేందుకు వీలుగా టిక్కెట్ బుక్ చేసుకున్నాడు.
కానీ, ఆ వ్యక్తి బెర్త్ వద్ద ఎలుకలు అటూ ఇటూ తిరగడం గమనించాడు. వీటిని వీడియో తీసి అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఎక్స్ ఖాతాలో షేర్ చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. దీంతో రైళ్లలో పరిశుభ్రత అంశం మరోమారు చర్చనీయాంశంగా మారింది. పైగా, ఏసీ మొదటి తరగతి బోగీలో ఎలుకలు ఇలా దర్శనమివ్వడం ప్రతి ఒక్కరినీ షాకింగ్కు గురిచేస్తుంది.
ప్రశాంత్ కుమార్ తన ట్వీట్లో "పీఎన్ఆర్ నంబర్ 6649339230, రైలు నంబరు 13288 (సౌత్ బిహార్ ఎక్స్ప్రెస్), ఏ1 కోచ్లో కొన్ని ఎలుకలు సీట్లు, లగేజీలపై తిరుగుతున్నాయి. అంత డబ్బులు చెల్లించి 2 ఏసీలో టిక్కెట్ కొన్నది ఇందుకేనా? అని ప్రశ్నించాడు.
తన ట్వీట్ను కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్, రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు, మీడియా సంస్థలకు ట్యాగ్ చేశారు. ఈ పరిస్థితిపై తొలుత అతడు రైల్వే హెల్ప్లైన్ (139)ను సంప్రదించగా, రైలులో సిబ్బంది పురుగు మందును పిచికారి చేసినట్టు తెలిపారు.
ఎక్స్లో ఫిర్యాదు చేసిన తర్వాత ఆ కోచ్లో సీట్ల వద్ద క్లీనింగ్ చేశామని, లైజాల్తో వైట్ స్వీపింగ్ చేసినట్టు సిబ్బంది పేర్కొన్నారు. సీటింగ్ ఏరియా కింద దోమల నివారణ మందును స్ప్రే చేశారని, సీటు కింద గ్లూ ప్యాడ్ను పెట్టారని తెలిపారు.
మరోవైపు, ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ పరిస్థితిపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేయగా, మరికొందరైతే భారతీయ రైల్వే ప్రయాణికులకు ఇదొక సాధారణమైన అనుభవమేనంటూ కామెంట్స్ పెట్టారు.