హత్రాస్ కుటుంబాన్ని దూరం పెట్టిన గ్రామస్తులు : మూడంచెల భద్రత!

గురువారం, 8 అక్టోబరు 2020 (12:32 IST)
నలుగురు కామాంధులు చేసిన పాడపని తమ కుమార్తెను పోగొట్టుకున్న హత్రాస్ హత్యాచార మృతురాలి కుటుంబం ఇపుడు భయం గుప్పెట్లో నివసిస్తోంది. ఈ దళిత కుటుంబానికి ఉన్నత వర్గమైన క్షత్రియ సమాజం నుంచి బెదిరింపులు వస్తున్నాయి. దీంతో ఊర్లో ఉండాలంటే భయం భయంగా ఉందని మృతురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా, ఊరి ప్రజలు వేస్తున్న నిందలు భరించలేకపోతున్నట్టు బోరున విలపించాడు. 
 
మరోవైపు, సుప్రీంకోర్టు ఆదేశాలతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మేల్కొంది. మృతురాలి కుటుంబానికి మూడు అంచెల భద్రత కల్పించింది. ఇందుకోసం భూల్గరీ గ్రామంలోని బాధిత కుటుంబం ఇంటి ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. కుటుంబ సభ్యుల అంగీకారం అనంతరం కెమెరాలను బిగించినట్టు హత్రాస్ జాయింట్ కలెక్టర్ ప్రేమ్ ప్రకాశ్ మీనా తెలిపారు. 
 
వారిని పరామర్శించేందుకు వచ్చే ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసేందుకు మెటల్ డిటెక్టర్లు కూడా ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో అక్టోబరు 8లోగా తమకు తెలియజేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది. 
 
ఇకపోతే, తమ కుటుంబానికి మూడు అంచెల భద్రతను కల్పించడమే మృతురాలి తండ్రి స్పందిస్తూ, ఊర్లో ఉండాలంటే భయంగా ఉందని, నిందలు భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గురించి, తమ కుమార్తె గురించి ప్రచారమవుతున్న వదంతులు తమను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయని కన్నీళ్లు పెట్టుకున్నారు. 
 
ఒకవైపు, కుమార్తెను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న తమకు చంపుతామంటూ బెదిరింపులు కూడా వస్తున్నాయని పేర్కొన్నారు. కష్టపడి పనిచేయడం మాత్రమే తమకు తెలుసని, కాబట్టి ఎక్కడికైనా వెళ్లిపోయి బతుకుతామన్నారు. ఈ ఘటన తర్వాత గ్రామంలోని అందరూ తమను దూరం పెట్టడం మరింత కుంగదీస్తోందని వాపోయారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు