ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

ఠాగూర్

ఆదివారం, 19 మే 2024 (11:24 IST)
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశ ప్రజల భవిష్యత్తు అయిన రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఇండియా కూటమి పనిచేస్తుందని హామీ ఇచ్చారు. 
 
తాము అధికారంలోకి వస్తే బీజేపీ ప్రవేశపెట్టిన అగ్నివీర్ పథకాన్ని రద్దు చేసి, చెత్త బుట్టలో వేస్తామని, జీఎస్టీని సరళీకరిస్తామని అన్నారు. బడా వ్యాపారవేత్తలకు బదులు చిన్న వ్యాపారులకు అండగా నిలుస్తామని అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించేందుకు మా కార్యకర్తలు అందరూ ఏకమయ్యారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని బీజేపీ, మోడీ అంటున్నారు. కాబట్టి, దాన్ని రక్షించడం మా మాధ్యత అని అన్నారు. 
 
గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు, డిప్లోమా హోల్డర్లతో కూడిన లిస్టును తయారు చేస్తున్నట్టు చెప్పారు. వారికి తొలి ఉద్యోగం హక్కుగా కల్పిస్తామని, ఏటా రూ.1 లక్ష పారితోషికం ఉంటుందని పేర్కొన్నారు. బీజేపీ వాళ్లు 5 కిలోల రేషన్ ఇస్తే తాము 10 కిలోల రేషన్ ఇస్తామని రాహుల్ పేర్కొన్నారు.
 
పేదలతో కూడిన జాబితా కూడా తయారు చేస్తామని రాహుల్ గాంధీ అన్నారు. ఈ కుటుంబాల నుంచి ఒక మహిళను ఎంపిక చేసి ఏటా రూ.లక్ష వారి అకౌంట్లో జమ చేస్తామని అన్నారు. నెలకు రూ.8 వేల చొప్పున వాళ్ల అకౌంట్లలో టకటకా పడిపోతాయని చెప్పారు. తాను ఏ పదాలు వాడితే మోడీ కూడా తన ప్రసంగాల్లో అదే పదాలు వాడుతున్నారని అన్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో చెబితే అదే మోడీ నోట తాను పలికిస్తానని సెటైర్ వేశారు.
 
కాంగ్రెస్ పార్టీకి అంబానీ, అదానీల నుంచి డబ్బులు అందుతున్నాయని ఆరోపిస్తున్న మోడీ ఈ విషయంలో దర్యాప్తునకు ఎందుకు ఆదేశించరని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ప్రధానితో డిబేట్ జరిగితే తాను అంబానీ - అదానీతో ఆయన సంబంధం ఏంటో ప్రశ్నిస్తానని పేర్కొన్నారు. ప్రధానితో చర్చకు తాను ఎప్పుడైనా రెడీ అని అన్నారు. కానీ మోడీ మాత్రం కేవలం ఓ 10 మంది జర్నలిస్టులకు దాదాపు 35 ఇంటర్వ్యూలు ఇచ్చి సరిపెట్టారని పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు