ఎర్రకోటపై దాడి.. కేంద్ర హోం శాఖ రివ్యూ.. సీరియస్

బుధవారం, 27 జనవరి 2021 (17:23 IST)
గణతంత్ర వేడుకల రోజున ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ముఖ్యంగా, ఎర్రకోటపై నిరసనకారులు దాడికి దిగారు. దీనిపై కేంద్ర హోం శాఖ సమీక్ష నిర్వహించింది. ముఖ్యంగా, ఎర్రకోటపై ఇతర జెండాలు ఎగురవేసిన ఘటనపై హోంశాఖ దృష్టి పెట్టింది. 
 
జెండాలు ఎగురవేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంశాఖ ఆదేశించింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దోషులను గుర్తించాలని పోలీస్‌శాఖకు కేంద్రం సూచించింది. 
 
ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఇప్పటికే 35 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసిన పోలీసులు, 200 మంది నిందితులను గుర్తించారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కేసు విచారణ చేపట్టింది. 
 
ఇదిలావుంటే, ఫిబ్రవరి 1న రైతు సంఘాలు పార్లమెంట్‌ ర్యాలీ తలపెట్టాయి. అయితే, మంగళవారం నాటి ఢిల్ ఘటన కారణంగా రైతులు పునరాలోచనలో పడ్డారు. పార్లమెంట్‌ ర్యాలీని వాయిదా వేసుకునే ఆలోచనలో ఉన్నారు. 
 
మరోవైపు, ఎర్రకోట‌ను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ ప‌టేల్ సందర్శించారు. రెడ్‌ఫోర్ట్‌లో ధ్వంసమైన భాగాలను ప్రహ్లాద్‌ పటేల్‌ పరిశీలించారు. కోట‌పై జెండాలు పాతే క్రమంలో .. రెడ్‌ఫోర్ట్‌లో కొన్ని చోట్ల గోడలు ధ్వంస‌మైనట్టు గుర్తించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు