ఆఫ్రికాలో పర్యటించి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్.. ఆందోళన అక్కర్లేదు.. ఆరోగ్య శాఖ

ఠాగూర్

మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (09:18 IST)
ఇటీవల ఆఫ్రికా దేశాల్లో పర్యటించి స్వదేశానికి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ వైరస్ సోకింది. ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ధృవీకరించింది. ఇది భారత్‌లో నమోదైన తొలి మంకీపాక్స్ కేసు అని చెప్పింది. ఇటీవల ఓ ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ సోకిందని, ఆదివారం అనుమానిత కేసుగా భావించిన వ్యక్తికి వ్యాధి నిర్ధారణ అయిందని, నమూనాలను సేకరించి పరీక్షించినట్టు వివరించింది. ప్రయాణ సమయంలో సోకిన కేసుగా నిర్ధారించినట్టు పేర్కొంది. నమూనాలు సేకరించి ప్రయోగశాలలో పరీక్షించగా రోగిలో పశ్చిమ ఆఫ్రికా క్లాడ్-2 ఎంపాక్స్ వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.
 
ఈ ఎంపాక్స్ కేసు నిర్ధారణపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. బాధితుడు ఒక యువకుడు అని, ఎంపాక్స్ వ్యాప్తిని ఎదుర్కొంటున్న ఒక దేశానికి ఇటీవల ప్రయాణించాడని పేర్కొంది. మూడంచెల సంరక్షణ సదుపాయాలు ఉన్న ఐసోలేషన్‌లో ఉన్నాడని తెలిపింది. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని, బహుళ అనారోగ్య సమస్యలు ఏమీ ఉత్పన్నం కాలేదని వివరించింది. కాగా రోగి పేరును కేంద్రం వెల్లడించలేదు.
 
దేశంలో గతంలో నమోదైన మంకీపాక్స్ కేసుల మాదిరిగా ఇది కూడా ఐసోలేట్ కేసు అని, హెల్త్ ఎమర్జెన్సీ అవసరం లేదని తెలిపింది. జులై 2022 నుంచి దేశంలో 30 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని, ఇది కూడా వాటి మాదిరేనని స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ కేసు పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీలో భాగం కాదని తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు