కసాయి భర్త : ఆడపిల్ల పుట్టిందనీ లేడీ కానిస్టేబుల్ పీక కోసిన ఆర్మీ జవాను

మంగళవారం, 8 ఆగస్టు 2017 (11:24 IST)
ఆడపిల్ల పుట్టిందని భార్య పీకను ఓ కసాయి భర్త కోసి హత్య చేశాడు. ఈ దారుణం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... డెహ్రాడూన్‌కు సమీపంలోని నైనిటాల్‌కు చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తి ఇండియన్ ఆర్మీలో డ్రైవరుగా పని చేస్తున్నాడు. 
 
ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిషీ అనే పోలీసు కానిస్టేబుల్‌ను పెళ్లాడాడు. ఈ దంపతులకు 8 నెలల క్రితం పండంటి ఆడబిడ్డ జన్మించింది. బిడ్డ పుట్టినపుడు విధుల్లో ఉన్న అనిల్ కుమార్.. ఇటీవలే ఇంటికి వచ్చి.. ఆడబిడ్డను ప్రసవించినందుకుగాను భార్య గొంతుకు తాడు బిగించి చంపి, ఆమె మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి భుజియాఘాట్‌లో పడేశాడు. 
 
అనంతరం తన భార్య బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని పోలీసులకు భర్త అనిల్ కుమార్ ఫిర్యాదుచేశాడు. దీంతో పోలీసులు నిషీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని భర్తను ప్రశ్నిస్తే అసలు హత్య విషయం వెలుగు చూసింది. హంతకుడైన భర్త అనిల్ కుమార్ పై ఐపీసీ సెక్షన్ 302, 201, ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. 

వెబ్దునియా పై చదవండి