మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ పండించిన మామిడి పండు ధర దేశంలో అత్యధిక ధర పలికింది. ఈ పండు ధర ఏకంగా రూ.10 వేలు పలికింది. మహారాష్ట్రలో ఏర్పాటుచేసిన వ్యవసాయ ప్రదర్శనలో ఒక్కో మామిడి భారీ రేటుకు అమ్ముడుపోయాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన ఓ మహిళ రైతు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మియాజాకీ రకానికి చెందిన మామిడిపండును పండించారు. నాదేండ్ జిల్లా భోసీ గ్రామానికి చెందిన సుమన్ బాబు గ్వైక్వాడ్ ఈ మామిడి పండును సాగు చేశారు. ఇటీవల నిర్వహించిన వ్యవసాయ క్షేత్రంలో ఒక్కో మామిడి పండు ధర రూ.10 వేల చొప్పున విక్రయించారు. ఈ రకం మామిడిని సాగు చేయడం వెనుక ఓ కథ కూడా ఉందని ఆ మహిళ అంటున్నారు.
సుమన్ బాయి కుమారుడు నందకిశోర్ యూపీఎస్సీ పరీక్ష కోసం పూణెలోని కోచింగ్ సెంటరులో చేరారు. అయితే, కరోనా కారణంగా ఆ సెంటర్ మూతపడటంతో ఆయన తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో ఉంటూ పరీక్షలకు సిద్ధమవుతున్న నందకిషోర్ ఆన్లైన్లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జపాన్కు చెందిన మియాజాకీ మామిడి పండు గురించి తెలుసుకున్నాడు.
తాము కూడా ఈ సాగు చేపడితే బాగుంటుందని భావించి తల్లికి చెప్పాడు. ఆ తర్వాత ఒక్కో దానికి రూ.6500 చొప్పున చెల్లించి ఫిలిప్పీన్స్ నుంచి మొత్తం 10 మొక్కలను తెప్పించి సాగు మొగలుపెట్టాడు. రెండేళ్ల క్రితం సాగు చేపట్టగా ఈ యేడాది కాపువచ్చింది. ఒక్కో చెట్టుకు 10 నుంచి 12 కాయలు వచ్చాయి. తాజాగా వాటిని వ్యవసాయ ప్రదర్శనలో ఉంచగా, ఒక్కో పండు ధర రూ.10 వేలు చొప్పున అమ్ముడుపోయాయి.