హనీమూన్‌కు వెళ్లిన కొత్త జంట మిస్సింగ్.. ఎక్కడ?

ఠాగూర్

శుక్రవారం, 30 మే 2025 (09:36 IST)
ఈశాన్య భారత రాష్ట్రమైన మేఘాలయాలో హనీమూన్‌కు వెళ్లిన కొత్త జంట అదృశ్యమైంది. ఈ దంపతులు కనిపించకుండా పోయి వారం రోజులైంది. వారి కోసం గాలిస్తున్నప్పటికీ రవ్వంత ఆచూకీ కూడా లభించలేదు. దీంతో ఆ దంపతుల కోసం మేఘాలయ ప్రభుత్వం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. 
 
మరోవైపు, కొత్తగా పెళ్లయిన జంట హనీమూన్ కోసం వెళ్లి అదృశ్యం కావడం కలకలం రేపింది. వారం రోజులు గడిచిపోయినా వారి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మేఘాలయ ప్రభుత్వం పోలీసులు, ఇతర శాఖల అధికారులు, స్థానికులతో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ కేసును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్టు సీఎం సంగ్మా వెల్లడించారు. 
 
ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌కు చెందిన ట్రాన్స్‌పోర్టు వ్యాపారి రాజా రఘువంశీ - సోనమ్‌లకు ఇటీవలే కొత్తగా వివాహమైంది. ఈ జంట హనీమూన్ కోసం మే 20న మేఘాలయ వెళ్లారు. చివరిసారిగా సోహ్రా (చిరపుంజీ)లో పర్యటించిన వాళ్లు.. ఆ తర్వాత అదృశ్యమయ్యారు. అయితే, స్థానికంగా ఓ బైకు అద్దెకు తీసుకుని కొండప్రాంతం వైపు వెళ్లినట్లు సమాచారం. అనంతరం ఓ ప్రాంతంలో బైకును వదిలేసి కాలినడకన వెళ్లినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. 
 
ఇక, ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న మేఘాలయ ప్రభుత్వం ముమ్మర గాలింపు చేపట్టింది. మరోవైపు వారి కుటుంబ సభ్యులు కూడా దంపతుల ఆచూకీ చెప్పిన వారికి రూ.5లక్షల రివార్డును ప్రకటించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి సంగ్మా మాట్లాడుతూ, "మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన నూతన దంపతులకు సంబంధించి దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. వాళ్లు అదృశ్యమైనట్లు మాకు సమాచారం అందింది. ఎంపీ సీఎం మోహన్ యాదవ్ కూడా టచ్‌లో ఉన్నారు. ఆ రాష్ట్ర హోంశాఖ నుంచి కాల్స్ వచ్చాయి. ఆ జంట ఆచూకీ కోసం పోలీసులు, అధికారులే కాకుండా స్థానికులు కూడా ముమ్మరంగా గాలిస్తున్నారు. దీనిపై రోజు వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నా" అని ముఖ్యమంత్రి ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు