భర్తను చూసేందుకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్న నవవధువు !!

ఠాగూర్

గురువారం, 12 జూన్ 2025 (22:03 IST)
లండన్‌లో ఉన్న తన భర్తను చూసేందుకు వెళుతూ ఓ నవవధువు మృత్యుఒడిలోకి చేరుకుంది. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోగా, కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. మృతుల్లో ఓ మహిళ లండన్‌లో ఉన్న తన భర్తను చూసేందుకు వెళుతూ ప్రాణాలు కోల్పోయింది. వివాహమైన కొన్ని రోజులకే ఆ నవవధువు, ఈ లోకాన్నే విడిచి వెళ్లిపోయిందన్న వార్త ఆమె కుటుంబ సభ్యులను కన్నీటి సంద్రంలో ముంచేసింది. 
 
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఖుష్బూ అనే యువతికి ఇటీవలే వివాహమైంది. ఆమె భర్త లండన్‌లో ఉన్నత చదువులు చదువుతున్నారు. పెళ్లి తర్వాత భర్త లండన్ వెళ్లగా, ఇప్పుడు ఆయన్ని కలిసేందుకు ఖుష్బూ బయలుదేరారు. అయితే, ఆమె ప్రయాణిస్తున్న విమానం అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురికావడంతో ఖుష్బూ మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వార్త తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. తమ కూతురి ఆచూకీ తెలియక వారు పడుతున్న బాధ వర్ణనాతీతం.
 
ఈ విమాన ప్రమాదంలో ఇద్దరు బ్రిటన్ జాతీయులు కూడా ఉన్నారు. వీరు ఇటీవల గుజరాత్ పర్యటనకు వచ్చి, ఎన్నో మధుర జ్ఞాపకాలతో తిరిగి లండన్‌కు బయలుదేరారు. విమానం ఎక్కడానికి కొన్ని గంటల ముందు, వారు తమ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంతో ఒక పోస్ట్ పెట్టారు.
 
"భారత్ పర్యటన అద్భుతంగా సాగింది. ఇక్కడ గడిపిన క్షణాలు ఎంతో సరదాగా ఉన్నాయి. కొన్ని గంటల్లో ఈ దేశాన్ని విడిచి వెళుతున్నందుకు బాధగా ఉంది. ఇక్కడ ఇదే మాకు చివరి రాత్రి. గుడ్ బై ఇండియా" అంటూ వారు రాసుకొచ్చారు. ప్రమాదం జరిగిన తర్వాత వారి పోస్ట్ సామాజిక మాధ్యమంలో వైరల్గా మారింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు