లైంగిక కోర్కె తీర్చాలని భర్త ఒత్తిడి: 53 ఏళ్ల భర్తను నరికేసిన 27 ఏళ్ల భార్య

ఐవీఆర్

గురువారం, 12 జూన్ 2025 (12:54 IST)
ఇటీవలి కాలంలో భర్తలను చంపుతున్న భార్యల కేసులు పెరుగుతున్నాయి. మేఘాలయ హనీమూన్ కేసులో ప్రియుడు కోసం భర్తను హతమార్చిన ఘటన వెలుగుచూసిన సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్రలో భర్తను హత్య చేసిన భార్య కేసు బైటకొచ్చింది.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మహారాష్ట్రలోని సంగ్లి జిల్లా పరిధిలో 53 ఏళ్ల అనిల్ లోఖాండే భార్య కేన్సర్ వ్యాధితో మరణించడంతో అతడు ఒంటరిగా వుంటున్నాడు. ఐతే ఈమధ్య ఎన్నాళ్లు ఒంటరిగా వుంటావు, పెళ్లి చేసుకోమంటూ పలువురు ఒత్తిడి చేసారు. దీనితో మధ్యవర్తుల ప్రమేయంతో 29 ఏళ్ల రాధిక అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. మే 23న వీరి వివాహం జరిగింది. అనంతరం రాధికను తీసుకుని అతడు తన నివాసానికి వచ్చాడు. వచ్చిన దగ్గర్నుంచి భార్యాభర్తల మధ్య చిన్నచిన్న కీచులాటలు జరుగుతున్నాయి.
 
దీనికి కారణం... తన లైంగిక కోర్కె తీర్చమని భార్య రాధికపై అనిల్ ఒత్తిడి చేస్తున్నాడు. అందుకు ఆమె ససేమిరా అనడంతో, అలాంటప్పుడు తనను పెళ్లి చేసుకోవడం ఎందుకు, ఈ పెళ్లిని రద్దు చేద్దామంటూ అనిల్ గట్టిగా చెప్పేసినట్లు సమాచారం. దీనితో ఆగ్రహం చెందిన రాధిక బుధవారం అర్థరాత్రి భర్త అనిల్ నిద్రిస్తుండగా అతడిపై గొడ్డలితో దాడి చేసి నరికి చంపేసింది. అనంతరం విషయాన్ని సమీప బంధువులకు తెలియజేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి నిందితురాలు రాధికను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు