తిరుపతిలో చైనా వ్యక్తికి కరోనా వైరస్ సోకలేదట... వైద్యుల వెల్లడి

మంగళవారం, 3 మార్చి 2020 (13:04 IST)
కంపెనీ పనులపై తిరుపతికి వచ్చిన చైనాకు చెందిన టెక్నీషియన్‌కు కరోనా వైరస్ సోకిందనే ప్రచారం జరిగింది. దీంతో ఆయన్ను తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచారు. ఆ తర్వాత ఆయన రక్త నమూనాలు సేకరించి పూణెలోని పరిశోధనాశాలకు పంపించారు. అక్కడ జరిపిన పరీక్షల్లో కరోనా వైరస్ సోకలేదని తేలింది. 
 
నిజానికి హైదరాబాద్‌కు చెందిన ఓ సాప్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా వైరస్‌ ఉందని తేలిన విషయం తెల్సిందే. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆందోళనకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో ఆ వైరస్‌ లక్షణాలతో తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో మరో వ్యక్తి చేరడంతో ఈ భయం మరింత పెరిగింది. అయితే, అతడిని పరీక్షించిన వైద్యులు అతడికి వైరస్‌ సోకలేదని స్పష్టం చేశారు.
 
ఇటీవల తైవాన్‌కు చెందిన చెన్‌ షి షున్‌(35) అనే వ్యక్తి ఇక్కడకు వచ్చాడని, అతడి రక్త నమునాలను పరీక్షల నిమిత్తం పూణేకు పంపామని రుయా వైద్యులు చెప్పారు. కరోనా నెగటివ్‌ ఫలితాలు వచ్చాయని, అతడిని మంగళవారం డిశ్చార్జి చేస్తామని తెలిపారు. కరోనాపై ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించారు. 
 
అపోలో ఆస్పత్రిలో గుర్తింపు 
మరోవైపు, సికింద్రాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో కరోనా కేసును గుర్తించామని ప్రముఖ హీరో రాం చరణ్ సతీమణి, కొణిదెల ఉపాసన వెల్లడించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్, వీడియోను పెట్టన ఆమె, కరోనా వైరస్‌పై అపోలోనే స్క్రీనింగ్ ప్రొటోకాల్స్‌ను అత్యంత కచ్ఛితత్వంతో పాటిస్తున్నామన్నారు. 
 
సదరు పేషంట్ ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మిగతా రోగులకు అతన్ని దూరంగా ఉంచి, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో చికిత్సను అందిస్తున్నట్టు తెలిపారు. కరోనా ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలు బాధ్యతగా ఉండి, ఏ మాత్రం వ్యాధి లక్షణాలు కనిపించినా, వైద్యులను సంప్రదించాలని కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు