నీట్ యూజీలో తప్పులు జరిగిన మాట వాస్తవమే.. కానీ రద్దు చేయొద్దు : ఎన్.టి.ఏ!!

సెల్వి

శనివారం, 6 జులై 2024 (12:28 IST)
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ ప్రవేశ పరీక్షలో తప్పులు జరిగిన మాట నిజమేనని, కానీ ఈ పరీక్షను రద్దు చేయడం వల్ల నిజాయితీగా రాసిన లక్షలాది మంది విద్యార్థులు జీవితాలు నాశనమవుతాయని ఈ పరీక్షను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు తెలిపింది. 
 
నీట్ ప్రశ్నపత్రం లీకైన వ్యవహారం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్న విషయం తెల్సిందే. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ సాగుతుంది. ఈ నేపథ్యంలో నీట్ ప్రవేశ పరీక్షను రద్దు చేసే ప్రసక్తే లేదని కేంద్రం అపెక్స్ కోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. 
 
నీట్ పరీక్షను రద్దు చేసేది లేదని తేల్చి చెప్పింది. పోటీ పరీక్షలకు పారదర్శక రీతిలో నిర్వహించేందుకు కట్టుబడివున్నామని స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీకేజీ కేసులో ఇప్పటికే నిందితులను అరెస్టు చేశామని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించామని కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌‍లో పేర్కొంది. 
 
అదేసమయంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్టుగా ఆధారాలు లేవని కోర్టుకు వివరించింది. అందువల్ల నీట్ ప్రవేశ పరీక్ష రద్దు సబబు కాదని పేర్కొంది. నీట్ పరీక్షను రద్దు చేస్తే నిజాయితీగా పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతారని వివరించింది. 
 
అదేవిధంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా ఇదే రీతిలోనే సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ పరీక్షను రద్దు చేయొద్దని కోరింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు