టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ కేసు - నిందితుల తల్లిదండ్రుల మెడకు ఉచ్చు

బుధవారం, 12 జులై 2023 (11:36 IST)
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు నిందితుల తల్లిదండ్రుల మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రశ్నపత్రాల కోసం డబ్బు చెల్లించిన అనేక మంది, ఆ డబ్బు తమ తల్లిదండ్రుల నుంచే అడిగి తీసుకున్నట్టు దర్యాప్తులో తేలింది. అంటే ప్రశ్నపత్రాల లీకేజీ కేసు గురించి చాలామంది తల్లిదండ్రులకు ముందే తెలిసి ఉంటుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. దాని ప్రకారం నేరం గురించి తెలిసీ చెప్పకపోవడం తప్పు కాబట్టి వారిని కూడా ఈ కేసులో జోడించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై సిట్‌ అధికారులు న్యాయపరమైన కసరత్తు చేస్తున్నారు.
 
గత నాలుగు నెలలుగా ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం 18 మందిని, మంగళవారం ముగ్గురిని అరెస్టు చేశారు. దాంతో ఇప్పటివరకూ అరెస్టయిన వారి సంఖ్య 78కి చేరింది. కనీసం 150 మంది వరకూ అరెస్టవుతారని భావిస్తున్నారు. చాలామంది అభ్యర్థులు రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. 
 
ఓ అభ్యర్థి అయితే ఏకంగా ఏఈ ప్రశ్నపత్రానికి రూ.30 లక్షలు చెల్లించాడు. కేవలం ఏఈ ప్రశ్నపత్రం అమ్మడం ద్వారానే ఓ దళారీ రూ.2.5 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇలా అనేక మంది పెద్దమొత్తంలో డబ్బు చెల్లించి ప్రశ్నపత్రాలు పొందారు. ఈ పరీక్షలు రాసిన వారిలో ఒకర్దిదరు మినహా మిగతావారంతా నిరుద్యోగులే. తల్లిదండ్రులపై ఆధారపడిన వారే. కాబట్టి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో తల్లిదండ్రులను సాక్షులుగా చేర్చాలని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఈ కేసులో ఇటీవల మరో పది మందిని సిట్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు