ప్రముఖ చరిత్రకారుడు బాబాసాహెబ్ పురందరే ఇకలేరు

సోమవారం, 15 నవంబరు 2021 (10:01 IST)
దేశంలో ఉన్న ప్రముఖ చరిత్రకారుల్లో ఒకరు బాబాసాహెబ్ పురందరే. ఈయన రచయిత కూడా. గత జూలై 29న 99వ పుట్టినరోజు జరుపుకున్న ఆయన గత శనివారం బాత్‌రూంలో జారిపడ్డారు. దీంతో పుణెలోని దీననాథ్ మంగేష్కర్ దవాఖాన ఐసీయూలో చికిత్స పొందుతూ వచ్చారు. 
 
ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం 5.07 గంటలకు తుదిశ్వాస విడిచారు. పుణేలోని వైకుంఠ శ్మశాన వాటికలో సోమవారం ఉదయం 10.30 గంటలకు పురందరే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
 
కాగా, చరిత్రకారుడు, రచయిత అయిన పురందరే నారాయణ్‌ రావ్‌ పీశ్వా, కేసరి, రాజా శివ్‌ఛత్రపతి, షెలార్క్‌హింద్‌, దౌలత్‌, నౌబత్‌ వంటి అనేక నవలలు రాశారు. శివాజీ కాలం నుంచి రాజు, అతని పరిపాలన, కోటలపై పలు పుస్తకాలు రాశారు. 
 
అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్‌పై రాసిన ‘జనతా రాజ్’ నాటకంతో ప్రసిద్ధి చెందారు. ఆ నటకానికి దర్శకత్వం కూడా వహించారు. రాజా శివ్‌ఛత్రపతి నవల 16 ఎడిషన్లు పబ్లిష్‌ అయ్యాయి. 5 లక్షలకుపైగా ప్రతులు అమ్ముడుపోయాయి. 
 
మరోవైపు, పురందరే సేవలకుగాను మహారాష్ట్ర ప్రభుత్వం 2015లో ‘మహారాష్ట్ర భూషణ్’ అవార్డును ప్రదానం చేసింది. 2019లో భారతదేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌ అందుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు