దేశ వ్యాప్తంగా వేసవి ఎండలు ముదిరిపోతున్నాయి. దీంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పాఠశాలలు ప్రారంభించే సమయ వేళలను మారుస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్ర్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఒంటిపూట బడుల సమయ వేళల్లో మార్పులు చేశారు. తాజాగా ఒరిస్సా ప్రభుత్వం కూడా అదే తరహా నిర్ణయం తీసుకుంది. అయితే, మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే ఒరిస్సా సర్కారు కాస్త వింతైన బడి వేళలను ప్రకటించింది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యే ఒంటిపూట బడులు ఉదయం 6.30 గంటల నుంచి ఉదయం 10.30 గంటల వరకు అంటే నాలుగు గంటలు మాత్రమే నిర్వహించాలని ఆదేశించింది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఈ తరహా మార్పులు చేయాలని ముఖ్యమంత్రి సూచించారని ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి నిత్యానంద గోండ్ వెల్లడించారు. వేసవికాలం ముగిసేవరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. అలాగే, బడులు నిర్వహించే రోజుల్లో పిల్లలకు తాగునీరు, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని వివరించారు.
మరోవైపు, ఏపీలో సైతం ఒంటిపూట బడుల్లో స్వల్ప మార్పులు చేసింది. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న పాఠశాలల్లో ఒంటిపూట బడుల ప్రారంభ సమయం మధ్యాహ్నం 1.30 గంటలకు మార్చాలని విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆదేశించాడు. అయితే, అంతకుముందు మధ్యాహ్నం 1.15 గంటలకే పాఠశాలలు ప్రారంభమయ్యేవి. మిగిలిన స్కూళ్లకు ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యా సంస్థలు కొనసాగుతాయని తెలిపారు. పదో తరగతి పరీక్షా కేంద్రాలున్న బడుల్లో మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు ఉంటాయని వివరించారు. రాష్ట్రంలో స్కూళ్ళకు మార్చి 15 నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు.