కేరళ కోస్ట్ గార్డ్ అదుర్స్.. చేపల బోట్‌లో మాదక ద్రవ్యాలు పట్టివేత..

గురువారం, 25 మార్చి 2021 (17:28 IST)
శ్రీలంక నుంచి అరేబియా సముద్రం మీదుగా భారత్‌లోకి డ్రగ్స్‌ను తరలిస్తున్న ముఠాను కేరళ కోస్ట్ గార్డ్ సిబ్బంది అరెస్ట్ చేసింది. వారిని నుంచి భారీ మొత్తంలో మాదకద్రవ్యాలు, పేలుడు పదార్థాలు, తుపాకులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మూడు బోట్లను సీజ్ చేశారు. పట్టుబడిన మాదక ద్రవ్యాల విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.3 వేల కోట్ల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు. మార్చి 18న ఈ ఘటన జరగగా.. దానికి సంబంధించిన వివరాలను ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు మీడియాకు తెలియజేశారు. 
 
వివరాల్లోకి వెళితే, మార్చి 18న ఎప్పటిలానే కోస్ట్ గార్డ్ సిబ్బంది అరేబియా సముద్రంలో గస్తీకి వెళ్లారు. ఐతే మినికాయ్ ద్వీపం సమీపంలో మూడు మత్స్యకారుల బోట్లు అనుమానాస్పదంగా కనిపించాయి. అవి శ్రీలంకు చెందిన బోట్లు. ఏదో తేడాగా ఉందని కోస్ట్‌గార్డ్ సిబ్బంది వాటిని వెంబడించారు. కోస్ట్ గార్డ్స్‌ను చూసి వారు పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ వారిని వెంటాడి ఎట్టకేలకు పట్టుకున్నారు. 
 
అవి చేపల బోట్లలానే కనిపించాయి. కానీ చేపలకు బదులు నిండా డ్రగ్స్ ఉన్నాయి. వారు మత్స్యకారుల్లానే ఉన్నారు. కానీ కరుడుగట్టిన డ్రగ్స్ ముఠా సభ్యులు. తేడా వస్తే ప్రాణాలు తీస్తారు. ఉగ్రవాదుల కన్నా డేంజర్. ఎట్టకేలకు ప్రాణాలకు తెగించి వారిని పట్టుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది... అత్యంత భద్రత నడుమ కేరళలోని వింజింజామ్ తీరానికి తీసుకొచ్చారు. 
 
ఈ ఘటనపై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) దర్యాప్తు చేస్తున్నారు. అంతే కాదు ఏకే 47 తుపాకలు కూడా లభించాయి. మొత్తం మూడు బోట్ల నుంచి 300 కేజీల హెరాయిన్, 5 ఏకే-47 తుపాకులు, 1000 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు