సూట్‌కేసులో 70 పాములు, చనిపోయిన కోతులు... ఎక్కడ?

శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (18:46 IST)
విమానంలో విషపూరిత పాములను సూట్‌కేసు ద్వారా తరలించిన తమిళనాడు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ప్రయాణికుల వస్తువులను తనిఖీ చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో హాంకాంగ్ నుంచి రాత్రి 10.30 గంటలకు బెంగళూరు విమానాశ్రయానికి విమానం చేరుకుంది. దిగిన ప్రయాణికులు టెర్మినల్ 1 గుండా బయటికి వస్తున్నారు. కస్టమ్స్ అధికారులు వారి వస్తువులను తనిఖీ చేశారు.
 
అంతలో ఓ యువకుడు సూట్‌కేస్‌తో వచ్చాడు. అతడిని చూడగానే అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు అతడి వద్ద విచారణ జరిపారు. అతను తమిళనాడుకు చెందినవాడని తేలింది. ఆ తర్వాత అతడు తెచ్చిన సూట్‌కేస్‌ను తెరిచి సోదాలు చేశారు. 
 
అంతే షాక్ అయ్యారు. ఆ సూట్‌కేసులో ప్రాణాంతక విషం ఉన్న 20 రాజనాగపు పాము పిల్లలతో సహా 70కి పైగా పాములు సజీవంగా ఉన్నాయి. ఒక్కో పామును చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో ఉంచినట్లు కూడా గుర్తించారు. అలాగే ఆ సూట్‌కేస్‌లో 6 చనిపోయిన కోతులు ఉన్నాయి. ఇది చూసి షాక్ తిన్న కస్టమ్స్ డిపార్ట్ మెంట్ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
 
వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద అతడిపై కేసు కూడా నమోదు చేశారు. ఇంకా సజీవంగా ఉన్న అన్ని పాములను హాంకాంగ్‌కు తిరిగి పంపించారు. చనిపోయిన ఆరు కోతులను మాత్రమే పారవేశారు. ఈ ఘటన విమానాశ్రయంలో కలకలం రేపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు