భారత్ దెబ్బకు వణికిపోతున్న పాకిస్థాన్ - రక్షణ వ్యయం 18 శాతానికి పెంపు

ఠాగూర్

బుధవారం, 7 మే 2025 (12:51 IST)
భారత్ దెబ్బకు దాయాది దేశం పాకిస్థాన్ వణికిపోతోంది. దీంతో ఆ దేశ రక్షణ వ్యయాన్ని 18 శాతం మేరకు పెంచింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పైగా, ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక చర్య చేపట్టింది. 
 
మరోవైపు, భారత్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పాకిస్థాన్‌లోని సంకీర్ణ ప్రభుత్వం వచ్చే బడ్జెట్‌లో రక్షణ వ్యయాన్ని 18 శాతం పెంచేందుకు ఆమోదం తెలిపింది. జులై 1న ప్రారంభంకానున్న 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను వచ్చే నెల మొదటి వారంలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అధినేత బిలావర్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ప్రధాని షెహబాజ్ షరీఫ్ బడ్జెట్‌పై చర్చించేందుకు సోమవారం సమావేశమైంది. పాక్ సంకీర్ణ ప్రభుత్వంలో పీపీపీ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సమావేశంలో రూ.17.5 ట్రిలియన్ల విలువైన కొత్త బడ్జెట్‌కు రూపకల్పన చేస్తూ రక్షణ వ్యయాన్ని 18 శాతం పెంచేందుకు అంగీకరించారు.
 
2024-25లో రక్షణ శాఖకు రూ.2,122 బిలియన్లను కేటాయించగా, ఈసారి అది రూ.2.5 ట్రిలియన్లు దాటనుంది. పాకిస్థాన్ కేటాయింపుల్లో రక్షణ శాఖ బడ్జెట్ రెండో అతి పెద్ద వ్యయం. అప్పులు తిరిగి చెల్లించేందుకు చేస్తున్న వ్యయం తొలి స్థానంలో ఉంది. ప్రస్తుత ఏడాదిలో రుణ చెల్లింపులకు రూ.9,700 బిలియన్లు కేటాయించింది.
 
దేశంలో ప్రజలు ద్రవ్యోల్బణంతో బాధపడుతున్నా, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా, ఆర్ధిక సంక్షోభంతో సతమతమవుతున్నా.. దేశ ప్రజల బాగోగులు పక్కన పెట్టి సైన్యాన్ని బలోపేతం చేయడం కోసం పాక్ రక్షణ వ్యయాన్ని భారీగా పెంచడం భారత్‌కు భయపడేనని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు