రైలు ఏసీ బోగీల్లో ఇచ్చే దుప్పట్లు ఎన్ని రోజులకు ఓసారి ఉతుకుతారో తెలుసా?

ఠాగూర్

శుక్రవారం, 25 అక్టోబరు 2024 (19:20 IST)
సాధారణంగా ఏసీ బోగీల్లో ప్రయాణించే ప్రయాణికులకు రైల్వే శాఖ దుప్పట్లను అందచేస్తుంది. అయితే, ఈ దుప్పట్లను శుభ్రం చేసే విషయానికి సంబంధించిన ఓ ఆశ్చర్యకర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ దుప్పట్లను నెలకు ఒకసారి మాత్రమే ఉతుకుతారట. ఈ విషయం సమాచార హక్కు చట్టం కింద ఓ ప్రయాణికుడు అడిగి ప్రశ్నకు రైల్వే శాఖ సమాధానమిచ్చింది. 
 
రైలులోని ఏసీ బోగీలో ప్రయాణించేటప్పుడు ఈసారి సొంత దుప్పటి తీసుకెళ్లడం మేలు. ఎందుకంటే రైలు ప్రయాణంలో ఇచ్చే దుప్పటిని నెలకోసారి మాత్రమే ఉతుకుతారట. అంటే అప్పటికి అది వేలాదిమంది ఒంటిపై నాట్యం చేస్తుందన్నమాటే. ఈ విషయాన్ని స్వయంగా రైల్వేనే వెల్లడించింది. ఏసీ ప్రయాణికులకు అందించే దుప్పట్లను ఎన్ని రోజులకు ఉతుకుతారంటూ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా అడిగిన ప్రశ్నకు రైల్వే ఇలా విస్తుపోయే సమాధానం ఇచ్చింది.
 
ఏసీ బోగీల్లో ప్రయాణికులకు నీట్‌గా ప్యాక్ చేసి ఓ కవరులో పెట్టిన దుప్పటి, బెడ్ షీట్, చిన్నపాటి దిండును రైల్వే అందిస్తుంది. తెల్లగా ఉండే ఇవి చూడగానే శుభ్రంగా ఉన్నట్టు అనిపిస్తాయి. నిజానికి ఇది తప్పని తాజాగా తేలిపోయింది. బెడ్ షీట్, పిల్లో కవర్‌లు మాత్రం ఉపయోగించిన ప్రతిసారీ ఉతుకుతారట. కానీ, నల్లటి దుప్పట్ల (కంబళ్లు)ను మాత్రం నెలకు ఒకటి, రెండుసార్లు మాత్రమే వాష్ చేస్తారట. 
 
అంటే ఆ దుప్పటి ఎంతోమంది ప్రయాణికుల శరీరాలను వెచ్చబరిచిన అనంతరం మన వద్దకు వస్తుందన్నమాట. అయితే, దురంతో, గరీబ్ రథ్ వంటి రైళ్లలో అదనంగా డబ్బులు చెల్లించి బెడ్డింగ్ సర్వీసును ఉపయోగించుకునే వీలుంది. 
 
ఆర్టీఐ ప్రశ్నకు రైల్వే ఇచ్చిన సమాధానం ప్రకారం.. రైలు జర్నీ పూర్తయిన తర్వాత పిల్లో కవర్, బెడ్షీట్‌ను లాండ్రీకి పంపిస్తారు. కానీ, దుప్పట్లను మాత్రం మళ్లీ చక్కగా ప్యాక్ చేసి సిద్ధంగా ఉంచుతారు. అవి మురికిగా కనిపించినా, వాసన వస్తున్నా అప్పుడు మాత్రమే వాటిని లాండ్రీకి పంపిస్తారట. కాగా, ఈ విషయాన్ని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) 2017లో తన నివేదికలో హెచ్చరించింది. రైలులో అందించే దుప్పట్లను కొన్నిసార్లు ఆరు నెలల వరకు ఉతకడం లేదని పేర్కొంది. సో.. ఈసారి రైలు ప్రయాణంలో దుప్పటిని వెంట తీసుకెళ్లడం మర్చిపోవద్దు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు