పొద్దున్నే ఆలస్యంగా నిద్ర లేస్తున్నాడనీ కొడుకుని కాల్చి చంపిన మాజీ జవాను

బుధవారం, 10 అక్టోబరు 2018 (09:36 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కన్నబిడ్డను ఓ మాజీ జవాను కాల్చి చంపాడు. అదీకూడా చిన్నపాటి విషయానికే. రోజూ ఉదయాన్నే ఆలస్యంగా నిద్ర లేస్తున్నాడనీ ఆగ్రహించిన మాజీ జవాను అయిన తండ్రి తుపాకీతో కాల్చి చంపాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాంచీకి చెందిన టికలీటోలీ నివాసి రాకేష్ రావత్ అనే వ్యక్తి జవానుగా పని చేసి ఇటీవలే ఉద్యోగ విరమణ చేశాడు. ఈయనకు రాహుల్ (29) అనే కుమారుడు ఉన్నాడు. రాహుల్ ప్రస్తుతం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. 
 
దీంతో రాహుల్ ప్రతీరోజూ ఉదయమే లేచి చదువుకోవాలని తండ్రి చెబుతూ వచ్చాడు. అయినా రాహుల్ లేటుగా లేస్తుండటంతో తండ్రీకొడుకుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలో కుమారునిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తండ్రి తన లైసెన్స్‌డ్ గన్‌తో కాల్చి చంపాడు. 
 
బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, అక్కడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మాజీ జవానును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు