దివికేగిన పారిశ్రామికదిగ్గజం రతన్ టాటా

ఠాగూర్

గురువారం, 10 అక్టోబరు 2024 (06:39 IST)
భారత దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూపు సంస్థల అధిపతి రతన్ టాటా దివికేగారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన బుధవారం రాత్రి 11.30 గంటలకు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తను టాటా సన్స్ గ్రూప్ ఛైర్మన్ ఎస్.చంద్రశేఖరన్ ధ్రువీకరించారు.
 
కాగా, సోమవారం వయోభారానికి సంబంధించిన పలు అనారోగ్య సమస్యల కారణంగా బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన రతన్ టాటాను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయితే రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో చికిత్స పొందుతూనే కన్నుమూశారు. రతన్ టాటా 28 డిసెంబర్ 1937న నావల్ టాటా-సోనీ టాటా దంపతులకు జన్మించారు. విదేశాల్లో చదువు పూర్తయిన తర్వాత రతన్ టాటా మొదట టాటా గ్రూప్ కంపెనీ టాటా ఇండస్ట్రీస్‌లో అసిస్టెంట్‌గా చేరారు.
 
రతన్ టాటా 1991లో 'టాటా సన్స్' ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1991 మార్చి నుండి డిసెంబర్ 2012 వరకు టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా.. టాటా గ్రూపును నడిపించారు. 1996లో టెలి కమ్యూనికేషన్స్ కంపెనీ అయిన టాటా టెలిసర్వీసెస్‌ను, 2004లో ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ను ప్రారంభించి పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. 
 
టాటా గ్రూప్ సంస్థను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో రతన్ టాటాది కీలక పాత్ర. రతన్ టాటా నాయకత్వంలో టాటా గ్రూప్స్ సంస్థ 100 బిలియన్ డాలర్ల విలువైన ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంగా ఉన్నత శిఖరాలకు ఎదిగింది. దిగ్గజ పారిశ్రామికవేత్తగానే కాకుండా రతన్ టాటా అంతకుమించి గొప్ప మానవతావాది కూడా. రతన్ టాటా సర్ దొరార్జీ టాటా ట్రస్టును స్థాపించారు. రతన్ టాటా సంపాదించిన లాభాల్లో దాదాపు 60 నుంచి 65 శాతం దాతృత్వ ప్రయోజనాల కోసం విరాళంగా అందజేసి తన గొప్పమనస్సును చాటి చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు