ఆదివారమే రాజాజీ హాలును శుభ్రం.. ఆ ప్రకటనలో నటరాజన్ పాత్ర? మోడీ చేతిలో రిమోట్?

శనివారం, 10 డిశెంబరు 2016 (14:04 IST)
రాజకీయాల్లో శక్తివంతురాలైన అమ్మ అనంత లోకాలకు వెళ్ళిపోవడంతో.. శశికళ గ్యాంగ్ అన్నాడీఎంకేలో ఓవరాక్షన్ చేస్తోంది. గుండెపోటుతో డిసెంబర్ 5న అమ్మ చనిపోతే సామాన్యుడైనా పార్టీని ముందుకు తీసుకెళ్లవచ్చునని శశికళ భర్త నటరాజన్ అంటున్నారు. నటరాజన్ మాట్లాడుతూ పార్టీలో శూన్యత లేదన్నారు. ఎంజీఆర్, 'అమ్మ' ఆకర్షణ ఉన్నంత కాలం ఏఐఏడీఎంకే కొనసాగుతుందన్నారు. 
 
ఇదిలావుండగా జయలలిత తుది శ్వాస విడవడానికి ముందు పార్టీ ఎమ్మెల్యేలతో నటరాజన్ సమావేశమైనట్లు సమాచారం. ఎంజీ రామచంద్రన్ సజీవంగా ఉన్నప్పుడే నటరాజన్ అన్నాడీఎంకేలో చేరారు. 'మన్నార్‌గుడి మాఫియా' అని పేరున్న కోటరీలో నటరాజన్ కూడా ఓ సభ్యుడు. ఈ కోటరీని జయలలిత దూరంగా ఉంచారు. 2011లో పొయెస్ గార్డెన్ నుంచి కూడా తరిమేశారు. శశికళను కూడా జయలలిత కొన్నాళ్ళు దూరంగా ఉంచారు. అయితే శశికళ తన కుటుంబాన్ని వదిలేసి రావడంతో మళ్ళీ జయలలిత చేరదీశారు. 'అమ్మ' మరణం తర్వాత పార్థివ దేహానికి అంతిమ సంస్కారాల్లో శశికళ కుటుంబీకులు పాల్గొన్నారు. 
 
అలాగే పన్నీర్ సెల్వం అకస్మాత్తుగా అర్ధరాత్రి వేళ ప్రమాణ స్వీకారం చేయడం వెనుక బలమైన శక్తిగా నటరాజన్ వ్యవహరించారంటున్నారు. ఎంజీఆర్ వారసురాలిగా జయలలితను ప్రకటించడంలో తానుకూడా పాత్రధారినేనని నటరాజన్ చెప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
 
ఇకపోతే.. జయలలిత డిసెంబర్ 5న ప్రాణాలు కోల్పోయినట్లు ఆస్పత్రి వర్గాల నుంచి సమాచారం వచ్చింది. కానీ ఒక రోజు ముందుగానే అంటే, డిసెంబర్ 4న, ఆదివారమే ఆమె కన్నుమూసినట్లు సమాచారం. అన్నాడీఎంకే నేతలు ఆదివారం సాయంత్రం నుంచే అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఆమె పార్థివదేహాన్ని ఉంచిన రాజాజీ హాల్‌ను కూడా శుభ్రం చేయాలని ఆదివారమే ఆదేశాలు అందాయట. కానీ అపోలో ఆసుపత్రి యాజమాన్యం కూడా అధికార పార్టీ నేతల ఆదేశాల ప్రకారమే సోమవారం అర్థరాత్రి ప్రకటన చేసినట్లు సమాచారం. 
 
అయితే శశికళ- నటరాజన్‌లపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కన్నేసినట్లు తెలుస్తోంది. తమిళనాట బీజేపీని బలోపేతం చేసే దిశగా శశికళ క్యాడర్‌ను అన్నాడీఎంకేలో ఉంచి ఆ పార్టీని రిమోట్ కంట్రోల్ ద్వారా తీసుకుని కేంద్రం నుంచి మోడీ నడపాలని భావిస్తున్నట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి