ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు షాక్

ఠాగూర్

మంగళవారం, 28 మే 2024 (14:00 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‍‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పొడగింపు పిటిషన్‌పై తక్షణ విచారణను చేపట్టలేమని సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ పిటిషన్ గురించి గత వారం ప్రధాన బెంచ్ ముందు ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించింది. ఈ కేసులో తీర్పు రిజర్వులో ఉన్నందున పిటిషన్ లిస్టింగ్‌పై తగు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ కేసులో జూన్ ఒకటో తేదీ వరకూ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెల్సిందే. జూన్ రెండో తేదీన ఆయన జైలు అధికారుల ఎదుట లొంగిపోవాల్సి ఉంటుంది. 
 
అయితే, వైద్య పరీక్షల నిమిత్తం బెయిల్ పిటిషన్‌ను మరో వారం రోజుల పాటు పొడగించాలంటూ కేజ్రీవాల్ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తన బరువు నెల రోజుల వ్యవధిలో అకారణంగా 7 కేజీల మేరకు తగ్గిపోయిందని అన్నారు. ఇది తీవ్ర అనారోగ్య సమస్యకు సంకేతమని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్ స్కాన్ సహా ఇతర వైద్య పరీక్షల కోసం ఏడు రోజుల సమయం పడుతుందని, ఇందుకు అనుగుణంగానే బెయిల్ పొడగించాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించినట్టు తెలిపారు. మే 10వ తేదీన ఆయన తీహార్ జైలు నుంచి విడుదలైన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు