25 వేల టీచర్ల ఉద్యోగాల నిలిపివేతపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!!

ఠాగూర్

బుధవారం, 8 మే 2024 (08:35 IST)
ఇటీవల వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో దాదాపు 25 వేలకు పైగా ఉపాధ్యాయ నియామక పోస్టులను రద్దు చేస్తూ కోల్‌కతా హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. పైగా, ఈ టీచర్లు తీసుకున్న వేతన భత్యాలన్నీ నాలుగు వారాల్లో తిరిగి చెల్లించాలంటూ ఆదేశించింది. ఈ తీర్పును బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కింది కోర్టు విధించిన తీర్పుపై స్టే విధించింది.
 
బెంగాల్ రాష్ట్రంలో గతంలో 25,743 టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలు చేపట్టారు. అయితే, ఇందులోభారీ స్కామ్ జరిగినట్టు సీబీఐ నిర్ధారించింది. సీబీఐ సమర్పించిన నివేదిక ఆధారంగా ఏప్రిల్ 22వ తేదీన కోల్‌కతా హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. 2016 నాటి స్టేట్ లెవల్ టెస్ట్ చేపట్టిన నియామక ప్రక్రియ చెల్లదంటూ అందులో పేర్కొంది. పైగా, నాటి నియామకాలను తక్షణం రద్దు చేయాలంటూ ఆదేశించింది. అంతేకాదు తమ వేతన భత్యాలను ఉద్యోగులు వడ్డీతో సహా తిరిగి చెల్లించాలంటూ ఆదేశించింది. ఈ తీర్పును ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సర్కారు తప్పుబడుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 
 
కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే, ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తును కొనసాగించవచ్చని తెలిపింది. అయితే, అభ్యర్థులు లేదా అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు