'నిర్భయ'పై దారుణ హత్యాచారానికి ఏడేళ్లు, దోషులను చూసినప్పుడల్లా మరణిస్తున్నట్లనిపిస్తోంది: నిర్భయ తల్లి

సోమవారం, 16 డిశెంబరు 2019 (16:08 IST)
న్యాయం కోసం ఏడేళ్లుగా చాలా ఓపికగా పోరాడుతున్నా. ఈ న్యాయపోరాటంలో నాకు నేనే ప్రశ్నగా మారాను. దోషులను కోర్టులో చూసిన ప్రతీసారి నేను మరణిస్తున్నట్లు అనిపిస్తోంది. నా పరిస్థితి నిర్భయకు ఎదురవనందుకు సంతోషం.
 
ఢిల్లీలో 2012, డిసెంబర్‌ 16వ తేదీన ఆరుగురు మృగాళ్లు నిర్భయపై దాడి చేసి అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనలో తీవ్రంగా గాయపడిన నిర్భయ మృతి చెందింది. నిర్భయపై ఈ ఘాతుకానికి పాల్పడి నేటికి ఏడేళ్లు పూర్తి అవుతోంది.
 
ఈ నేపథ్యంలో ఆమె తల్లి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. న్యాయం కోసం తాను ఏడేళ్లుగా చాలా ఓపికగా పోరాడుతున్నానని అన్నారు. కానీ, 2012 నాటికి, నేటికీ ఏమీ మారలేదని, తాను చేస్తోన్న న్యాయపోరాటంలో తనకు తానే ప్రశ్నగా మారానని ఆవేదన వ్యక్తం చేశారు.
 
తన కూతురిపై దారుణానికి పాల్పడిన దోషులను కోర్టులో చూసిన ప్రతీసారి తాను మరణిస్తున్నట్లు అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. తనలాగే తన కూతురికి ఈ పరిస్థితి ఎదురవనందుకు సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. వాళ్లను చూసేందుకు తన కూతురు బతికి లేనందుకు కాస్త సంతోషంగా ఉందని భావోద్వేగభరితంగా మాట్లాడారు. తన కూతురి ఉండిఉంటే ఆమె కూడా తనలాగే ఎంతో వేదన అనుభవించేదని చెప్పారు. 
 
దేశంలోని ఆడపిల్లలు ఏం తప్పు చేశారని ఆమె ప్రశ్నించారు. వాళ్లపై ఎందుకు హత్యాచారాలకు పాల్పడుతున్నారని నిలదీశారు. ఈ సమస్యలకు సమాజం ఎందుకు పరిష్కారాలను కనుగొనలేకపోతుందని ఆమె ప్రశ్నించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు