గుజరాత్‌లో అసమర్థ నాయకత్వం.. అందుకే ప్రధాని మోడీ పర్యటన : శివసేన

బుధవారం, 19 మే 2021 (20:11 IST)
గుజరాత్ రాష్ట్రంలో అసమర్థ నాయకత్వం ఉందనీ అందుకే ఆ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారని శివసేన పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. తౌక్టే తుఫాను దెబ్బకు కేరళ, కర్నాటక, మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల్లో అపార నష్టం వాటిల్లింది. 
 
ఈ నేపథ్యంలో ప్ర‌ధాని నరేంద్ర మోడీ కేవ‌లం గుజ‌రాత్‌లోనే తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో బుధవారం పర్యటించారు. అలాగే తక్షణ సాయంగా వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటించారు. దీనిపై శివ‌సేన విమ‌ర్శ‌లు గుప్పించింది. గుజ‌రాత్ రాష్ట్రంలో సంక్షోభాన్ని ఎదుర్కోలేని అస‌మ‌ర్థ నాయ‌క‌త్వం ఉన్నందువల్లే ప్ర‌ధాని ఆ రాష్ట్రాన్ని ఎంచుకున్నార‌న్నారు. 
 
మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే ఏ సంక్షోభం ఎదురైనా ధీటుగా ఎదుర్కోగ‌ల‌ర‌ని, ప్ర‌ధానికి కూడా ఈ విష‌యం తెలుసున‌ని రౌత్ పేర్కొన్నారు. మ‌రోవైపు సేన ఎంపీ విమర్శ‌ల‌ను కాషాయ పార్టీ తోసిపుచ్చింది. ప్ర‌ధాని మోడీపై దాడి చేసే బదులు మ‌హారాష్ట్ర మంత్రులు ఎసీ గ‌దుల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయాల‌ని బీజేపీ నేత రామ్ క‌ద‌మ్ హిత‌వు ప‌లికారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు