కరోనా ఎఫెక్ట్: విదేశీ ప్రయాణీకులకు కొన్ని మినహాయింపులు

మంగళవారం, 4 ఆగస్టు 2020 (08:09 IST)
కోవిడ్-19 అన్ లాక్ 3.0 లో భాగంగా విదేశాల నుంచి మన దేశానికి వచ్చే ప్రయాణీకులకు కేంద్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ కొన్ని మినహాయింపులు ఇస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈనెల 8వ తేదీ నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమలులోకి రానున్నాయి. 
 
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కొత్త మార్గదర్శకాలు:
 
ప్రయాణానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
1) విమానం ఎక్కేందుకు కనీసం  72 గంటల ముందు తప్పనిసరిగా www.newdelhiairport.in ఆన్ లైన్ పోర్టల్‌లో సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
 
2) విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులు తప్పనిసరిగా 14 రోజులు క్వారంటైన్ లో ఉండేందుకు అంగీకరిస్తూ సెల్ఫ్‌-డిక్లరేషన్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో 7 రోజులు వారి సొంత డబ్బుతో పెయిడ్ క్వారంటైన్ మరియు 7 రోజులు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలి.
 
3) తీవ్రమైన జబ్బులు ఉన్న వారికి, గర్భిణులకు, పదేళ్లలోపు ఉన్న పిల్లలున్న తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణిస్తే వారిని చూడడానికి వెళ్తున్న ప్రయాణికులకు ఏడు రోజుల ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌ (ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే క్వారంటైన్‌ కేంద్రాలు) నుంచి మినహాయింపును ఇచ్చింది. ఈ ప్రయాణికులందరూ అత్యవసర క్వారంటైన్‌కు బదులుగా 14 రోజుల హోం క్వారంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
 
4) పైన చెప్పిన విధంగా మినహాయిపులు కోరేవారు విమానం ఎక్కే 72 గంటల ముందు www.newdelhiairport.in ఆన్ లైన్ లో పోర్టల్ ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వం స్పందించి ఆన్ లైన్ పోర్టల్ ద్వారా ఇచ్చే సమాచారమే తుది నిర్ణయం అవుతుంది. 
 
5) అంతే కాకుండా ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌ (ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే క్వారంటైన్‌ కేంద్రాలు) నుంచి మినహాయింపు పొందాలనుకునే వారు కోవిడ్ నెగెటివ్‌ ఉన్నట్లు చెప్పుకొనే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేయించుకున్న రిపోర్టును జత చేయాలి.  ఈ టెస్ట్ విమానం ఎక్కడానికి 96 గంటల ముందే చేయించుకొని ఉండాలి. తప్పుడు సమాచారమిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని కేంద్రం స్పష్టం చేసింది.
 
విమానం ఎక్కే ముందు:
1) విమానాల్లో ప్రయాణం చేస్తున్న సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? అన్న వివరాలు తెలిసేలా సంబంధిత ట్రావెలింగ్ ఏజెన్సీలు లేదా సంస్థలు టికెట్ వెనుక ముంద్రించాలి. 
 
2) ప్రయాణాలు చేసే ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యసేతు యాప్ ను తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాలి
 
3) ప్రయాణాలకు ముందు థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత కోవిడ్ లక్షణాలు లేని వారిని మాత్రమే విమానం/షిప్ లలోకి అనుమతిస్తారు.
 
4) వివిధ దేశాల సరిహద్దుల ద్వారా ప్రయాణించే వారికి కూడా పైన తెలిపిన నియమాలే అమలులో ఉంటాయి. కోవిడ్ లక్షణాలు లేని వారిని మాత్రమే దేశంలోకి అనుమతిస్తారు.
 
5) విమానాశ్రయాల్లో క్రమం తప్పకుండా శానిటైజేషన్ / క్రిమీసంహారక ద్రావణంతో శుభ్రంచేయాలి. 
 
6) ఎయిర్‌పోర్ట్‌లలో తప్పని సరిగా ప్రయాణీకులు భౌతిక దూరం పాటించేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. 
 
విమానంలో ప్రయాణించే సమయంలో:
1) ఆన్ లైన్ పోర్టల్‌లో సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వని ప్రయాణీకులు విమానంలోగానీ, షిప్ లోకానీ డూప్లికేట్ ఫారమ్ ను నింపి ఆ ఫారమ్ ఎయిర్ పోర్టులోని ఉన్నతాధికారులకు అందజేయాల్సి ఉంటుంది. కొన్ని ఎయిర్ పోర్టులలో సంబంధిత అధికారుల సూచనల మేరకు అక్కడిక్కడే దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
2) కోవిడ్-19 వ్యాప్తిని నివారించేందుకు తీసుకుంటున్న చర్యలు, ఇతర విధివిధానాలను ఎయిర్ పోర్టులు/ షిప్ లలో తప్పకుండా అనౌన్స్ మెంట్ రూపంలో ప్రచారం చేయాలి.
 
3) బోర్డింగ్, ప్రయాణం చేసే సమయంలో ప్రయాణీకులు అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించడంతో పాటు చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉండేలా ఎయిర్ పోర్టు, షిప్ స్టాఫ్ చర్యలు తీసుకోవాలి
 
విమానం దిగిన తర్వాత:
1) విమానం నుంచి దిగే సమయంలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి.

2) బయటకు వెళ్లే ప్రదేశంలో థర్మల్ స్క్రీనింగ్ చేసే దగ్గర ఎయిర్ పోర్ట అధికారులకు ఆన్ లైన్ పోర్టల్ లో సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చిన ఫామ్ ను చూపించాలి. 
 
3) స్క్రీనింగ్ సమయంలో ఏ ప్రయాణికైనా కోవిడ్ లక్షణాలున్నట్టు గుర్తిస్తే సదరు వ్యక్తిని వెంటనే ఐసోలేట్ చేయడం లేదా మెడికల్ ప్రొటోకాల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలి. 
 
4) థర్మల్ స్క్రీనింగ్ కి ముందు ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ నుంచి మినహాయింపు కోరు (ఆన్ లైన్ లో వారి అభ్యర్థనను అంగీకరించినట్టు ముందుగానే చూపించే) అందుకు సంబంధించిన రుజువులను ఆయా రాష్ట్రాలకు సంబంధించిన కౌంటర్ల దగ్గర చూపించి 14 రోజుల హోమ్ క్వారంటైన్ కు వెళ్లాలి. 
 
5) మిగిలిన ప్రయాణీకులందరినీ ఆయా రాష్ట్రాలు అన్ని సదుపాయాలు ఉండేలా ఎంపిక చేసిన   ఇనిస్టిట్యూషన్ క్వారంటైన్ లకు తరలించాలి. 
 
6) ప్రయాణీకులు ఇనిస్టిట్యూషన్ క్వారంటైన్ లో కనీసం 7 రోజులపాటు ఉండాలి. ఐసిఎంఆర్    ప్రొటోకాల్స్ ప్రకారం వారికి పరీక్ష చేస్తారు. ఒకవేళ పాజిటివ్ వస్తే వెంటనే సంబంధిత చికిత్స ఇస్తారు.

 a) అసింప్టోమాటిక్ / ప్రీ-సింప్టోమాటిక్ / చాలా తేలికపాటి కేసులుగా గుర్తిస్తే వారిని కోవిడ్ కేర్ సెంటర్‌లో (పబ్లిక్ & ప్రైవేట్ రెండూ) ఐసోలేషన్ లో ఉంచాలి.

 b) తేలికపాటి / మితమైన / తీవ్రమైన లక్షణాలు ఉన్నవారిని ప్రత్యేకంగా ఎంపిక చేసిన కోవిడ్‌ ఆస్పత్రుల్లో  చేర్చి తదనుగుణంగా చికిత్స అందిస్తారు. 

ఒకవేళ నెగిటివ్ రిపోర్టు వస్తే మరో 7 రోజులపాటు ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండేందుకు అవసరమైన సూచనలు చేస్తారు.
 
7) ఆ సమయంలో మరోసారి ఏమైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే స్థానికంగా ఉండే అధికారులకు గానీ, 1902కి గాని సమాచారం ఇవ్వాలి.
 
గమనిక: క్వారంటైన్ మరియు ఐసోలేషన్ విషయంలో పైన సూచించిన మార్గదర్శకాలతోపాటు సంబంధిత రాష్ట్రాలే మరికొన్ని సొంత ప్రొటోకాల్స్ ను సిద్ధం చేసుకోవచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు