మొక్కజొన్నచేనులోకి అతన్ని పిలిచింది ఆ యువతే : బీజేపీ నేత

బుధవారం, 7 అక్టోబరు 2020 (10:58 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ హత్యాచార మృతురాలికి ఇంతకుందే అక్రమ సంబంధం ఉందని, అదీ కూడా ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడితోనే ఈ సంబంధం ఉందని బీజేపీ నేత రంజిత్ బహదూర్ శ్రీవాస్తవ ఆరోపించారు. అంతేకాకుండా, ప్రధాన నిందితుడుని మొక్కజొన్నతోటలోకి పిలిచింది కూడా ఆ యువతేనని చెప్పుకొచ్చారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. 
 
అంతేకాకుండా, యువతిపై అత్యాచారానికి తెగబడిన నిందితులు నలుగురు అమాయకులని ఆయన క్లీన్ చిట్ ఇచ్చారు. పైగా, హత్యాచార బాధితురాలికి ఈ కేసులోని ప్రధాన నిందితుడితో అక్రమం సంబంధం ఉందని, ఆమే అతడిని మొక్కజొన్న చేనుకు పిలిచిందని దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు చేశారు. ఈయనపై ఇప్పటికే 44 క్రమినల్ కేసులు నమోదైవుండటం గమనార్హం. 
 
అంతేకాదు, బాధిత యువతి ఓ అవారా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిందితుడిని యువతి ప్రేమించిందని, ఘటన జరిగిన రోజున ఆమె అతడిని మొక్కజొన్న చేనుకు పిలిచిందని పేర్కొన్నారు.
 
మొక్కజొన్న చేలు, జొన్న పొలాలు, అడవుల్లో ఇలాంటి ఆవారా యువతులు మరణిస్తూ కనిపించడం సర్వసాధారణమైన విషయమేనని పేర్కొన్నారు. కనీసం సీబీఐ చార్జిషీటు దాఖలు చేసేంత వరకైనా నిందితులను విడిచిపెట్టాలని కోరారు. నిందితులు నిర్దోషులని తేల్చి చెప్పారు. కాగా, రంజిత్ శ్రీవాస్తవ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ మండిపడింది. ఆయనకు నోటీసులు పంపిస్తామని కమిషన్ చైర్‌పర్సన్ రేఖాశర్మ చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు