మర్కజ్ జమాత్ చీఫ్ ఆచూకీ లభ్యం.. అరెస్టు తప్పదా?

బుధవారం, 8 ఏప్రియల్ 2020 (12:17 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి కారకుడయ్యాడన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న మర్కజ్ తబ్లీగి జమాత్ సంస్థ అధిపతి మౌలానా మహ్మద్ సాద్ ఖందల్వీ ఆచూకీని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు. ఢిల్లీలోని జాకీర్ నగర్‌లో ఉన్న తన నివాసంలోనే ఆయన స్వీయ నిర్బంధంలో ఉన్నట్టు తెలుసుకున్నారు. అయితే, ఆయనకు కరోనా వైరస్ సోకిందా లేదా అన్నదానిపై స్పష్టతరావాల్సివుంది. ఎందుకంటే ఈ మర్కజ్ తమ సమ్మేళనానికి వచ్చిన అనేక మంది విదేశీ ప్రతినిధులతో పాటు.. స్వదేశీ ప్రతినిధులకు ఈ వైరస్ సోకింది. వీరివల్ల దేశంలోని అనేక రాష్ట్రాలకు ఈ వైరస్ విస్తరించిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో సాద్‌పై వివిధ సెక్షన్ల కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యంగా, జమాత్‌కు హాజరైన వారిలో వేలాది మంది కరోనా వైరస్‌ బారిన పడినట్లు ఆ తర్వాత వెల్లడి కావడం, వారి నుంచి పలువురికి వైరస్‌ విస్తరించిందన్న వైద్య వర్గాలు స్పష్టత ఇచ్చాయి. దీంతో ఆయనపై కేసు నమోదు చేయడం జరిగింది.
 
కేసు నమోదైన తర్వాత సాద్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కరోనా ప్రబలుతున్న సమయంలో నిజాముద్దీన్‌ సమావేశాన్ని రద్దు చేయాలని పలువురు ఇస్లామిక్‌ మతాధికారులు సూచించినా మౌలానాసాద్‌ వినలేదని సమాచారం. దీనివల్ల  వేలమంది జమాత్‌ సభ్యులు ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లయిందన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. 
 
అంతేకాకుండా, కరోనా వైరస్ బారినపడిన అనేక జమాత్ సభ్యులు కూడా వైద్య చికిత్సలకు ఏమాత్రం అంగీకరించడం లేదన్న వార్తలు వచ్చాయి. దీంతో సాద్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కరోనా వైరస్‌కు వైద్యులు అందించే చికిత్సకు ప్రతి జమాత్ సభ్యుడు సహకరించాలని కోరారు. 
 
ఈ పరిస్థితుల్లో సాద్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌, షామ్లీ ప్రాంతాల్లో గాలించారు. ఎట్టకేలకు ఢిల్లీలోని జాకీర్‌నగర్‌ ప్రాంతంలో తన నివాసంలోనే మౌలానా సాద్‌ స్వీయ క్వారంటైన్‌లో ఉన్నారని ఈరోజు గుర్తించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు