'నాకు కడుపుకోత మిగల్చకురా' నాన్నా.. తల్లి ప్రేమకు కరిగిపోయిన ఉగ్రవాది

శనివారం, 5 నవంబరు 2016 (12:12 IST)
తల్లి ప్రేమ ముందు ఉగ్రవాదం కరిగిపోయింది. ఫలితంగా అప్పటివరకు కరుడుగట్టిన ఉగ్రవాదిలా ఉన్న ఆ యువకుడు... తల్లి మాటలు వినగానే తన మనసు మార్చుకున్నాడు. 'నాకు కడుపుకోత మిగల్చకురా' అంటూ ఆ తల్లి మాటలు ఆ కరుడుగట్టిన ఉగ్రవాదిని పూర్తిగా మార్చేశాయి. దీంతో తల్లి ప్రేమకు ఈ ప్రపంచంలో మరేదీ సాటిరాదనే విషయం మరోసారి నిరూపితమైంది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని సోపోర్‌లోని ఓ ఇంట్లో లష్కరే తాయిబాకు చెందిన ఉగ్రవాది ఉమర్ ఖలిక్ మిర్ (26) దాగున్నాడంటూ సైన్యానికి సమాచారం అందింది. వెంటనే ఆ ప్రాంతాన్ని సైన్యం చుట్టుముట్టింది. వెంటనే లొంగిపోవాలంటూ సైన్యం చేసిన హెచ్చరికలను మిర్ ఖాతరు చేయలేదు.
 
దీంతో, అక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలోనే నివాసముంటున్న మిర్ తల్లిదండ్రులకు సైనికాధికారులు పరిస్థితిని వివరించారు. వారి కుమారుడు లొంగిపోయేలా చేయాలని కోరారు. అతడికి పెద్ద శిక్ష పడకుండా తాము చూసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో మిర్ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. 
 
అనంతరం, మిర్ దాగి ఉన్న ఇంట్లోకి అతని తల్లి వెళ్లి తన కుమారుడికి మొరపెట్టుకుంది. తన తల్లి పడుతున్న బాధను, ఆమె కన్నీటిని చూసి మిర్ కరిగిపోయాడు. బయటకు వచ్చి సైన్యానికి లొంగిపోయాడు. అంతేకాదు, తన వద్ద ఉన్న రైఫిల్, బుల్లెట్స్, గ్రేనేడ్స్, రేడియో సెట్‌ను అధికారులకు అప్పగించాడు. ఈ యేడాది మే నెలలో ఇంటి నుంచి వెళ్లిపోయిన మిర్... లష్కరే తాయిబాలో చేరి కఠోర శిక్షణ పొందాడు. ఆ తర్వాత విధ్వంసం సృష్టించేందుకు భారత్‌లో చొరబడి తల్లిప్రేమకు లొంగిపోయాడు. 

వెబ్దునియా పై చదవండి