ఎప్పుడో పాతకాలం నాటి నిబంధనలను ఇప్పటికీ ఆయా ప్రభుత్వ ఉద్యోగ అర్హతలుగా కొనసాగిస్తుండటం వల్ల అవి కొంతమంది ప్రాణాలను తీస్తున్నాయి. తాజాగా ఒడిశా ప్రభుత్వం నిర్వహించిన అటవీశాఖ ఉద్యోగాల ఫిజికిల్ పరీక్ష ముగ్గురు ప్రాణాలను తీసింది. ఈ పరీక్ష ఏమిటంటే... 4 గంటల వ్యవధిలో అభ్యర్థులు 25 కిలోమీటర్లు నడక పూర్తి చేయాలి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులయ్యేందుకు అభ్యర్థులంతా వడివడిగా నడుచుకుంటూ వెళ్లడం ప్రారంభించారు.
ఐతే ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థుల్లో ముగ్గురు అభ్యర్థులు నడుస్తూ నడుస్తూనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. విపరీతమైన వేడి ఉష్ణోగ్రతలు ఒకవైపు, నడుస్తున్న సమయంలో ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటు వచ్చి చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. కాగా ముగ్గురు అభ్యర్థులు ఇలా మరణించడంపై ఒడశా ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. ప్రతి బాధిత కుటుంబానికి రూ. 4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. కాగా.. ప్రాణాలు పోయేంత కఠినంగా వున్న నిబంధనలను సడలించాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.