మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 85వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా శనివారం జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి పలువురు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, బీజేపీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు అబ్దుల్ కలాంకు నివాళులు అర్పించారు.
ఇదిలావుండగా, కలాం మొదటి వర్థంతిని పురస్కరించుకుని తొలి విడతలో 25 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ.15 కోట్ల వ్యయంతో మణిమండప నిర్మాణపనులకు సంబంధించి భూమిపూజ జరుగనుంది. ఇందుకు సంబంధించిన ఇంజనీర్లు గురువారం సమాధి ప్రాంగణాన్ని పరిశీలించి సర్వే నిర్వహించారు కూడా.
అంతేకాకుండా రామనాథపురం జిల్లా రామేశ్వరంలోని కలాం సమాధి ప్రాంగణంలో ఆయన జీవిత చరిత్రతో కూడిన ఎగ్జిబిషన్, విజ్ఞాన కేంద్రం, స్మారక మండపం, తదితరాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాంకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత జగన్ నివాళి అర్పించారు. అక్టోబర్ 15న కలాం జయంతి సందర్భంగా ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు. స్ఫూర్తిప్రదాతగా అబ్దుల్ కలాం ఎన్నటికీ నిలిచిపోతారని ఈ సందర్భంగా జగన్ కొనియాడారు.