'లేహ్' యూటీ కాదా? ట్విట్టర్‌కు షాకివ్వనున్న కేంద్రం!

శుక్రవారం, 13 నవంబరు 2020 (12:15 IST)
కేంద్రపాలిత ప్రాంతమైన లేహ్‌ను అలాకాకుండా జమ్మూకాశ్మీర్‌లో అంతర్భాగంలో మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ చూపించింది. ఈ చర్యపై కేంద్రం సీరియస్ అయింది. అంతేకాకుండా, ఎందుకలా చూపించారో వివరణ ఇవ్వాలంటూ ట్విట్టర్‌కు ఐదు రోజుల గడువు ఇచ్చింది. 
 
ప్రభుత్వ ఆదేశాలపై ట్విట్టర్ స్పందించకున్నా, అది ఇచ్చే వివరణ 'సంతృప్తికరంగా' లేకున్నా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ముందు పలు ఆప్షన్లు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద భారత్‌లో ట్విట్టర్ యాక్సెస్‌ను బ్లాక్ చేయవచ్చు. ఆరు నెలల జైలు శిక్ష పడేలా పోలీసు కేసు నమోదు చేయవచ్చు.
 
లేహ్‌ను ఉద్దేశపూర్వకంగానే జమ్మూకాశ్మీర్‌లో భాగంగా చూపించినట్టు జాక్ డోర్సీకి చెందిన ట్విట్టర్‌కు ప్రభుత్వం పంపిన నోటీసులో పేర్కొంది. భారత సార్వభౌమత్వాన్ని అణగదొక్కేందుకు చేసిన ప్రయత్నంలో ఇది భాగమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. లేహ్‌ను భారత ప్రభుత్వం కేంద్ర ప్రాలిత ప్రాంతంగా ప్రకటించిందని, దాని రాజధాని లేహ్ అని తెలిపింది. 
 
'తప్పుడు పటాన్ని చూపించి భారతదేశ ప్రాదేశిక సమగ్రతను అగౌరవపరిచినందుకు' వెబ్‌సైట్, దాని ప్రతినిధులపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు