పోలవరం పనులను వేగవంతం చేయాలి : మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్

సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (14:28 IST)
పోలవరం పనులను మరింత వేగవంతం చేయాలని కేంద్ర జలవనరుల శాఖామంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి పోలవరం ప్రాజెక్టు విషయాన్ని ప్రస్తావించారు. సవరించిన అంచనాలను ఎప్పుడు ఆమోదిస్తారో చెప్పాలని కేంద్ర జలశక్తిమంత్రిని కోరారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.2500 కోట్లు సొంత నిధులను ఖర్చు చేసిందని వివరించారు. 
 
ప్రాజెక్టు నిర్మాణానికి రూ.47వేల 725కోట్ల వ్యయం అవుతుందని రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ అంచనా వేసినట్లు మార్చి 2020లో లోక్‌సభలో మంత్రి ప్రకటించారని ఎంపీ గుర్తుచేశారు. కానీ సాంకేతిక నిపుణుల కమిటీ 2017-18 ధరల ప్రకారం రూ.55 వేల 656 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసిందని తెలిపారు. 
 
దీనిపై కేంద్ర మంత్రి గజేంద్ర షేకావత్‌ సమాధానమిస్తూ, 2013-14 ధరల ప్రకారం ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. ధరలు పెంచేందుకు అవకాశం లేదని విభజన చట్టంలో పేర్కొన్నట్లు తెలిపారు. పెరిగిన ధరలపై నిపుణుల కమిటీ ఇచ్చిన సవరించిన అంచనాలను ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. 
 
ప్రాజెక్టు నిర్మాణానికి రివాల్వింగ్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలని విజయసాయి రెడ్డి కోరారు. ఇలా చేస్తే నిధుల సమస్య ఉండదని అనుకున్న సమయానికి ప్రాజెక్టు నిర్మించే అవకాశం ఉంటుందన్నారు. దీనిపైనా స్పందించిన షెకావత్‌ పొలవరం నిర్మాణానికి ఎటువంటి నిధులు సమస్య లేదని వివరించారు. 
 
నాబార్డ్‌ నిధులను అందజేస్తామన్నారు. పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బిల్లులను సమర్పించాలన్నారు. వాటి పరిశీలన తర్వాత నిధులు విడుదల చేస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు. ప్రాజెక్టులో సవరించిన అంచనాలు అధ్యయనం చేయాల్సి ఉందని వివరించారు. అంచనాల అధ్యయనం తర్వాత కేబినేట్‌కు పంపుతామన్నారు. కేబినేట్‌ నిర్ణయం మేరకు ముందుకెళ్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు